Nalgonda : సామాజిక సమానత్వానికి కృషి చేసిన మహానీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్..!

Nalgonda : సామాజిక సమానత్వానికి కృషి చేసిన మహానీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్..!
నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి
నల్లగొండ, మన సాక్షి :
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119 వ జయంతిని పురస్కరించుకొని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల ఎదురుగా నిర్వహించిన సమావేశంలో నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ భారత దేశంలో అణగారిన వర్గాల ఆశా కిరణం బాబు జగ్జీవన్ రామ్ అని, చిన్న వయసులోనే స్వాతంత్ర సమరంలో పాల్గొని భారత దేశ స్వాతంత్రానికి కృషి చేశారని, దేశ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించారని , కార్మిక , రక్షణ ,వ్యవసాయ శాఖ మంత్రిగా ఎన్నో విజయాలు సాధించిన గొప్ప వ్యక్తి అని అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ జీవితం దేశానికి గొప్ప సందేశమని, ఆయన ఆశయాలు ఆదర్శం గా తీడుకొని సమసమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, వారి ఆశయాలకు ఆచరణలో పెట్టేందుకు కృషి చేయాలన్నారు.
జిల్లా కలెక్టర్ బి.చంద్ర శేఖర్ మాట్లాడుతూ మహనీయుల ఆశయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు .22 ఏళ్లకే స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ దేశానికి ఎనలేని కృషి చేశారన్నారు. కార్మిక చట్టాలను తీసుకురావడమే కాకుండా, ఇండో -పాక్ యుద్ధంలో చతుతను చాటారని తెలిపారు. చదువు కుటుంబానికి, సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో విద్యార్థులు ఆలోచించాలన్నారు.
ఉన్నత చదువులు చదవాలని, సమాజాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాదో ఆలోచించాలని, ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని, హాస్టళ్లలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నదని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మారుతున్న సాంకేతిక పరిస్థితులకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ని ఉపయోగించుకోవాలని, సాంకేతికతను అందిపుచ్చుకోవాలని చెప్పారు.
డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, రెవెన్యూ ఆధనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, విశ్రాంత ఐఏఎస్ చోల్లేటి ప్రభాకర్, దళిత సంఘాల నాయకులు వున్న కైలాస్ నేత, మాజీ జెడ్పిటిసి లక్ష్మయ్య, మార్పాక నరేందర్, పెరికా షణ్ముఖ కుమార్, పాలడుగు నాగరాజు, కవితా రాణి, గోలి ఏడుకొండలు, పెరిక స్వాతి, శ్రీనివాసరావు, కత్తుల షణ్ముఖ కుమార్, జగన్ కుమార్ ,బుర్ర సుధాకర్ , కత్తుల సంజీవయ్య, అవుట రవీందర్, చక్కిలం రామరాజు, పెరిక శెట్టి,దుప్పల లక్ష్మీనారాయణ, ఆదిరెడ్డి, ధనలక్ష్మి ,సైదులు, కాటం శివ తదితరులు మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై .అశోక్ రెడ్డి, జిల్లా అధికారులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు.
అంతకుముందు మర్రిగూడ బైపాస్ వద్ద డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే ఎన్ జి కళాశాల వద్ద డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.










