పెళ్లి ఇంట్లో తీవ్ర విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి, పెళ్లికూతురు సహా ఎనిమిది మందికి గాయాలు..!
పెళ్లి ఇంట్లో తీవ్ర విషాద ఘటన నెలకొన్నది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కంభంలో శుక్రవారం ఉదయం జరిగింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో పెళ్లి బృందం తీవ్ర విషాదంలోకి వెళ్ళింది.

పెళ్లి ఇంట్లో తీవ్ర విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి, పెళ్లికూతురు సహా ఎనిమిది మందికి గాయాలు..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
పెళ్లి ఇంట్లో తీవ్ర విషాద ఘటన నెలకొన్నది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కంభంలో శుక్రవారం ఉదయం జరిగింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో పెళ్లి బృందం తీవ్ర విషాదంలోకి వెళ్ళింది. పెళ్ళికి కొద్దిసేపటికి ముందే పెళ్లి బృందం పైకి అదుపుతప్పిన లారీ దూసుకెళ్లడంతో నలుగురు మృతిచెందగా పెళ్లికూతురుతో సహా మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అమరావతి – అనంతపురం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని నల్లబండ బజారుకు చెందిన పెళ్లి బృందం కంభం లో జరగనున్న వివాహానికి హాజరైంది. ఉదయం 9:30 గంటలకు వివాహం జరగాల్సి ఉండగా అంతకుముందు స్థానిక వినాయకుడి ఆలయం వద్ద పెళ్లికూతురితో కొబ్బరికాయ కొట్టించే కార్యక్రమం నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు బంధువులు నిలబడి ఉన్నారు.
అదే సమయంలో వేగంగా వచ్చిన లారీ అదుపు తప్పి నేరుగా వారిపైకి దూసుకెళ్లింది. పెళ్లి బృందాన్ని ఢీ కొట్టిన లారీ అనంతరం మరో మూడు ద్విచక్ర వాహనాలకు, రెండు బడ్డీ బంకులను కూడా ఢీ కొట్టింది. ఆ సమయంలో తీవ్ర భయాందోళన నెలకొన్నది. ప్రమాదంలో ఆవుల అలకనంద (19) ఆవుల అంకాలు, ఆవుల నగేష్ (17) ఏడాదిన్నర చిన్నారి ఆవుల నాగేశ్వరి అక్కడికక్కడే మృతి చెందారు.
పెళ్లికూతురు ఆవుల వీరక్క తీవ్ర గాయపడటంతో పాటు మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మృతి చెందిన వారిలో పెళ్ళికూతురి ఇద్దరు సొంత అన్నలు, వదిన, మేనకోడలు ఉండటం కుటుంబ సభ్యుల్లో విషాదం నెలకొన్నది. పెళ్లి వేడుక జరగాల్సిన ఇంట్లో ఒక్కసారిగా విషాదం అలముకున్నాయి. దాంతో బంధువులు కన్నీరు కావడంతో పాటు గ్రామమంతా విషాద ఛాయలు అలముకున్నాయి.









