హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో యువకుడి మృతిపై వీడని మిస్టరీ..!
హుస్నాబాద్ లోని ఎల్లమ్మ చెరువులో ఈతకు వెళ్లి అనుమానాస్పద స్థితిలో గత నెలలో మృతి చెందిన దాసారపు కార్తీక్ (23) మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో యువకుడి మృతిపై వీడని మిస్టరీ..!
ప్రమాదమా..? ప్రణాళికాబద్ధమైన హత్యనా..?
నా కొడుకును వారే చంపేశారు..
తండ్రి సదానందం పలు ఆరోపణలు..
పోస్ట్మార్టం నివేదికతోనే తేలనున్న కార్తీక్ మరణ రహస్యం!
కరీంనగర్, మనసాక్షి :
హుస్నాబాద్ లోని ఎల్లమ్మ చెరువులో ఈతకు వెళ్లి అనుమానాస్పద స్థితిలో గత నెలలో మృతి చెందిన దాసారపు కార్తీక్ (23) మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పచ్చునూరు గ్రామానికి చెందిన కార్తీక్ కరీంనగర్ లో డిగ్రీ చదువుతున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడంతో, తన తండ్రి సదానందం పనిచేస్తున్న ఓ ప్రయివేట్ కంపెనీ కాంట్రాక్టర్ వద్ద అసిస్టెంట్ సూపర్వైజర్ గా చేరాడు.
హుస్నాబాద్ ఏరియాలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనుల వద్ద కొద్దిరోజులుగా విధులు నిర్వహిస్తున్నాడు. గత నెల జూన్ 02న మంగళవారం డ్యూటీ సమయంలో కార్తీక్ ను అతనితో పాటు పనిచేసే హబీబ్, సతీష్, ప్రదీప్ రెడ్డిలు కారులో హుస్నాబాద్ లోని ఎల్లమ్మ చెరువు వద్దకు తీసుకెళ్లారు. చెరువులో ఈత కొడుతూ లోపలికి వెళ్లిన కార్తీక్ ఎంతకీ తిరిగి రాలేదు.
సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో కార్తీక్ మృతదేహాన్ని వెలికితీశారు. కాగా కార్తీక్ మృతదేహం ఒంటిపై గాయాలు ఉన్నాయని, బాగా ఈత వచ్చిన తన కొడుకు చెరువులో మునిగిపోవడం సాధ్యం కాదని తండ్రి సదానందం వాపోతున్నారు. విధులు నిర్వహించాల్సిన సమయంలో తోటి కార్మికులు కార్తీక్ను ఎల్లమ్మ చెరువు వద్దకు ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చిందో అర్థం కావడం లేదన్నారు.
వారే తన కొడుకును హత్య చేసి, ప్రమాదంగా చిత్రీకరించేందుకు చెరువులో పడేసి ఉంటారని ఆయన అనుమానిస్తున్నారు. హబీబ్, సతీష్, ప్రదీప్ రెడ్డిల ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని, అసలు ఏం జరిగిందనే నిజాలు ఆ ముగ్గురికే తెలుసని సదానందం స్పష్టం చేశారు. మృతుడి తండ్రి సదానందం ఇచ్చిన ఫిర్యాదు మేరకు హుస్నాబాద్ పోలీసులు అనుమానస్పద మృతి గా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానితులుగా ఉన్న ముగ్గురు తోటి ఉద్యోగులని దృష్టిలో ఉంచుకుని, ఈ మరణం వెనుక ఉన్న అసలు కారణాలను వెలికితీసేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలనీ మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులను కోరుతున్నారు. పోస్ట్మార్టం నివేదిక వస్తే మృతికి గల ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని అధికారులు పేర్కొన్నారు.









