Nalgonda : నరేంద్ర మోడీ హయాంలో దేశంలో తీవ్రమైన సంక్షోభం..!
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం హయాంలో సంక్షోభం ఏర్పడిందని అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్ అన్నారు.

Nalgonda : నరేంద్ర మోడీ హయాంలో
దేశంలో తీవ్రమైన సంక్షోభం..!
కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సరళీకరణ విధానాలతోనే రైతుల ఆత్మహత్యలు
దొడ్డి దారిన మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం
నవంబర్ 18-24 తేదీల్లో నల్లగొండ పట్టణంలో అఖిల భారత కిసాన్ సభ 36వ మహాసభలు
అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్
నల్గొండ ప్రతినిధి, మన సాక్షి :
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం హయాంలో సంక్షోభం ఏర్పడిందని అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్ అన్నారు. శుక్రవారం నాడు నల్లగొండ పట్టణంలోని ఏచూరి గార్డెన్ లో నిర్వహించిన అఖిల భారత కిసాన్ సభ 36వ మహాసభ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో విజ్జు కృష్ణన్ మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పలాస, విజయవాడ, ఖమ్మం, గుంటూరు లో అఖిలభారత కిసాన్ సభ మహాసభలు నిర్వహించామని 36వ అఖిలభారత కిసాన్ సభ మహాసభ లు నల్గొండ పట్టణంలో నిర్వహించబోతున్నామని తెలిపారు.
మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షోభం కారణంగా ఐదు లక్షల మంది రైతులు, వలస కార్మికులు, వ్యవసాయ కార్మికులు, ఆదివాసి రైతులు, మహిళా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. ఇందులో అన్ని రాష్ట్రాలు నిజాలు చెప్పడం లేదని విమర్శించారు. సంక్షోభం కారణంగా ఇంకా ఎక్కువమంది ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. దేశంలో ఆర్థిక సరళీకరణ విధానాల కారణంగా అప్పుల కారణంగా ఈ 12 సంవత్సరాలలో 10 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని విచారం వ్యక్తం చేశారు. దేశంలో ఇలాంటి దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు.
2020 కరోనా సమయంలో లాక్ డౌన్ పెట్టి మూడు నల్ల చట్టాలని తీసుకొచ్చారని తెలిపారు. ఢిల్లీలో సంవత్సరం పైగా జరిగిన రైతు ఉద్యమం ఫలితంగా ఈ చట్టాలను వెనక్కి తీసుకున్నారు. బీహార్ ఎన్నికల తర్వాత మళ్లీ ఈ నల్ల చట్టాలను దొడ్డి దారిన తీసుకొచ్చే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు ఈ కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు జూలై 29న ఢిల్లీలో సంయుక్త కిసాన్ సభ ట్రేడ్ యూనియన్లు వ్యవసాయ కార్మిక సంఘాలు కలిసి సదస్సు నిర్వహించనున్నాయని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక సరళీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 10న అన్ని రాష్ట్రాల్లో కార్మిక కర్షక ఐక్యతతో పది లక్షల మందితో జైల్ బరో నిర్వహించనున్నామని పేర్కొన్నారు. కార్పొరేట్ వ్యవసాయానికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమాలలో 736 మంది రైతులు చనిపోయారని తెలిపారు. అమెరికా, న్యూజిలాండ్, యూరోపియన్ దేశాల నుండి పత్తి, సోయాబీన్ ఇతర పంటల దిగుమతులపై సుంకాలను తగ్గించారని దీని కారణంగా దేశంలో తీవ్రమైన సంక్షోభం ఏర్పడనుందని ఆవేదన వ్యక్తం చేశారు.
న్యూజిలాండ్ నుండి పాలు దిగుమతి చేసుకో ఉన్నారని ఆ పాల ధర 25 రూపాయలు లీటర్ కు ఉండనుందని అప్పుడు దేశంలోని రైతుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా రైతులు కార్మికులు కర్షకులు పోరాడాలని పిలుపునిచ్చారు.
కిసాన్ సభ 1990లో ఏర్పాటయింది. దేశంలో 27 రాష్ట్రాలలో పనిచేస్తున్న సంఘంలో కోటి 60 లక్షల మంది సభ్యులు ఉన్నారు. భూమికోసం భుక్తి కోసం పెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటం దేశంలో కొత్త చరిత్రను సృష్టించిందని అలాంటి చరిత్ర గల నల్లగొండ గడ్డపై నవంబర్ 18, 19, 20, 21 తేదీలలో అఖిలభారత కిసాన్ సభ 36వ మహాసభలు నిర్వహించనున్నామని తెలిపారు. ఈ మహాసభలకు 800 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు. రైతులు ప్రజాసంఘాలు మహాసభల విజయవంతం సహకరించాలని కోరారు.









