Karimnagar : వర్షాలు కురవాలని కప్పతల్లికి పూజలు, వాడ వాడలో ఊరేగింపు..!
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఆకునూరు గ్రామంలో సర్పంచ్ గుర్రాల స్వతంత్ర ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామ ప్రజలు మహిళలు సకాలంలో వర్షాలు కురవాలని గ్రామ దేవతలకు జలాభిషేకం నిర్వహించి, కప్పతల్లి ఊరేగింపును ఘనంగా నిర్వహించారు.

Karimnagar : వర్షాలు కురవాలని కప్పతల్లికి పూజలు, వాడ వాడలో ఊరేగింపు..!
కరీంనగర్, మనసాక్షి :
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఆకునూరు గ్రామంలో సర్పంచ్ గుర్రాల స్వతంత్ర ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామ ప్రజలు మహిళలు సకాలంలో వర్షాలు కురవాలని గ్రామ దేవతలకు జలాభిషేకం నిర్వహించి, కప్పతల్లి ఊరేగింపును ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా రోకలి బండకు కప్పను వస్త్రముతో కట్టి వాడ వాడకు గడప గడపకు వెళ్లి, కప్పతల్లి పూజలు నిర్వహించి , కప్పతల్లి కడవడే నీళ్లు అంటూ కప్పతల్లి పాటలు పాడారు. గ్రామంలోని ప్రజలు చిన్నారులు పెద్దలు భక్తి శ్రద్ధలతో కప్పతల్లి రోకలి కట్టుకున్న వారిపై బిందెలతో నీళ్లు పోసి వాన దేవుడిని వర్షం కురవాలి అని ప్రార్థించారు .
గ్రామ సర్పంచ్ గుర్రాల స్వతంత్ర మాట్లాడుతూ వర్షాకాలం మొదలై నీటికి రెండు నెలలు కావస్తున్నా కూడా సకాలంలో వర్షాలు లేక రైతులు గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వరుణ దేవుడు కరుణించి సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిపించాలని నాటు వేసిన పొలాలకు కూడా పత్తి మొక్కజొన్న మొదలైన పంటలకు నీరు లేక రైతన్నలు ఇబ్బందులు పడుతున్నారన్నారు
కప్పతల్లి గడపగడపకు ఊరేగింపు చేసి అనంతరం ఆకునూరు గ్రామంలోని రామలింగేశ్వర శివాలయంలో శివలింగానికి జలాభిషేకం, ఎల్లమ్మ తల్లికి జలాభిషేకం, పోచమ్మ తల్లికి జలాభిషేకం, ఆంజనేయ స్వామికి జలాభిషేకం, నాగులమ్మకు జలాభిషేకం, గ్రామంలోని గ్రామదేవతలకు జలాభిషేకం చేసి సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు రైతులు గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని దేవుళ్లను ప్రార్థించినట్టు గ్రామ సర్పంచ్ గుర్రాల స్వతంత్ర తెలిపారు.
గ్రామంలోని మత్తడిబండ పై గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వరుద పాయసాన్ని గ్రామ ప్రజలు ప్రసాదాన్ని తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుర్రాల స్వతంత్ర తోపాటు పాలకవర్గ సభ్యులు, ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.










