నల్గొండ జిల్లాలో విషాదం.. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య..!
కూతుళ్ల పెళ్లిళ్ల కోసం చేసిన అప్పులు తీరే మార్గం కనిపించక, మనస్తాపంతో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్రంపోడు ఎస్సై వెంకన్న తెలిపారు.

నల్గొండ జిల్లాలో విషాదం.. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య..!
గుర్రంపోడు, మన సాక్షి :
కూతుళ్ల పెళ్లిళ్ల కోసం చేసిన అప్పులు తీరే మార్గం కనిపించక, మనస్తాపంతో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్రంపోడు ఎస్సై వెంకన్న తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మోసంగి గ్రామానికి చెందిన కాశిమల్ల వెంకటయ్య (56) వృత్తిరీత్యా కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
ఆయనకు ముగ్గురు కూతుళ్లు గతంలో వారి వివాహాల సమయంలో వెంకటయ్య పెద్ద మొత్తంలో అప్పులు చేశాడు. రోజురోజుకూ పెరిగిపోతున్న అప్పులను ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు.ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన వెంకటయ్య.. ఈనెల 24న (సోమవారం) ఉదయం తన వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి, పత్తి చేనుకు కొట్టే పురుగుల మందు తాగాడు.
గమనించిన కుటుంబ సభ్యులు ఆయన్ను తక్షణమే నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి (ఆగస్టు 25న) 11:20 గంటల ప్రాంతంలో వెంకటయ్య మృతి చెందాడు. మృతుడి భార్య కాశిమల్ల జయమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వెంకన్న తెలిపారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వెంకటయ్య మరణించడంతో మోసంగి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.









