MLC Kavitha : కేసిఆర్ పాలన ఐఫోన్.. రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్..!
MLC Kavitha : కేసిఆర్ పాలన ఐఫోన్.. రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్..!
జగిత్యాల, (మన సాక్షి) :
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల సంఖ్యను తక్కువగా చూపడం శోచనీయమని, కేసిఆర్ పాలన ఐఫోన్ లా ఉంటే… రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్ లా ఉందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చే వరకు ఉద్యమం ఆగదని, రాజకీయ కక్షతో రైతులకు రేవంత్ సర్కార్ నీళ్లు ఇవ్వడం లేదని, రాజకీయ కక్షలు పక్కన పెట్టి అభివృద్ధి, సంక్షేమం పై దృష్టి పెట్టాలని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేసీఆర్ పాలన ఐఫోన్ లా ఉంటే… రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్ లా ఉందని, ఐఫోన్ కు, చైనా ఫోన్ కు ఎంత తేడా ఉంటదో… కేసీఆర్ కు, రేవంత్ రెడ్డికి అంత తేడా ఉందన్నారు. మాటలు చెప్పి బీసీల ఓట్లు వేయించుకొని సీఎం రేవంత్ రెడ్డి బూరడి కొట్టించారన్నారు.
ఏ కులంలో ఎంత జనాభా ఉన్నారో లెక్కలు ఎందుకు బయటపెట్టడం లేదని, తూతూమంత్రంగా మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ సంఘాలతో సమావేశం పెట్టారని, స్వయంగా ముఖ్యమంత్రి ఎందుకు సమావేశమవ్వడం లేదని ప్రశ్నించారు. బీసీ ఉద్యమం చేస్తున్న నాయకులతో ముఖ్యమంత్రి మాట్లాడకపోవడం బీసీలను అవమానించడమేనని, బీసీ కుల సంఘాలతో ముఖ్యమంత్రి చర్చలు జరపాలన్నారు. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే వరకు ఉద్యమం ఆగదని, మరో తెలంగాణ పోరాటం తరహా పోరాటానికి బీసీలంతా సిద్ధంగా ఉండాలన్నారు.
తప్పుడు జనాభా లెక్కలు చెప్పడంతో బీసీ సమాజం అట్టుడుకుతోందని, సీఎం రేవంత్ రెడ్డి వెంటనే బీసీ కుల సంఘాలతో చర్చలు జరపాలని, 52 శాతం బీసీలు ఉన్నారని 2014లోనే కేసీఆర్ లెక్క తేల్చారని, లెక్కపెట్టడం కూడా రాని రేవంత్ రెడ్డి సర్కారు తప్పుడు లెక్కలు చెబుతోందని, బీసీల సంఖ్యను తక్కువ చూపించడం శోచనీయమన్నారు.
ఈ తప్పుడు లెక్కలు చెప్పి రాహుల్ గాంధీ పార్లమెంటును తప్పదోవపట్టించారని, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి బిల్లు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచించిందని, ఎండిపోయిన పోలాలను చూపిస్తూ రైతులు బాధపడుతున్నారని, ఎండిన పంటపొలాలను చూస్తుంటే కన్నీళ్లు వచ్చే పరిస్థితి ఉందన్నారు. కేసీఆర్ పై అక్కసుతో మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగించడం లేదని, రైతులను నీళ్లించే తెలివి లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని, రాజకీయ కక్షను పక్కనపెట్టి సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం నీళ్లను విడుదల చేయాలన్నారు.
ఆడపిల్లలు స్కూటీలు, మహిళలకు రూ.2500 ఏమయ్యాయని, మహిళలను చిన్నచూపు చూస్తున్న రేవంత్ రెడ్డికి కాలం గుణపాఠం చెబుతుందన్నారు. రేవంత్ రెడ్డి తప్పులను ప్రజలు లెక్కిస్తున్నారు.. తగిన సమయంలో బుద్దిచెబుతారన్నారు. రేషన్ కార్డులను ఎందుకు జారీ చేయడం లేదని, రుణ మాఫీ ఎక్కడా కూడా సంపూర్ణంగా కాలేదన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ లో చేరారని, అయినా కూడా మనోధైర్యంతో కార్యకర్తలు చెక్కుచెదరలేదని, ఉప ఎన్నిక వస్తే జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుందన్నారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎల్. రమణ, జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్, మాజీ మార్క్ ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి, నాయకులు ఓరుగంటి రమణరావు, అమీన్ ఉల్ హాసన్, గట్టు సతీష్, ఆనంద్ రావు, ఆసిఫ్, దేవేందర్ నాయక్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
■ MOST READ :
-
Rythu Bharosa : రైతులకు భారీ షాక్.. వారికి రైతుభరోసా కట్..!
-
Gold Price : బంగారం ఆల్ టైం రికార్డ్.. తెలుగు రాష్ట్రాల్లో ధర ఎంతంటే..!
-
Nalgonda : నల్గొండ జిల్లాలో భారీ చోరీ.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో 23 లక్షల బ్యాగు మాయం..!
-
WhatsApp : వాట్సాప్ యూజర్స్ కు బిగ్ అలర్ట్.. జీరో క్లిక్ హ్యాకింగ్..!
-
Rythu Bharosa : రైతు భరోసా మళ్లీ ఎప్పుడంటే.. డేట్ ఫిక్స్.. బిగ్ అప్డేట్..!









