కోట్లల్లో సూర్యాపేట టిపిఎస్ ఆస్తులు.. 8 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు..!
ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి వి. సోమయ్యపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది.

కోట్లల్లో సూర్యాపేట టిపిఎస్ ఆస్తులు.. 8 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు..!
సూర్యాపేట, మనసాక్షి :
ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి వి. సోమయ్యపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. నల్గొండ రేంజ్ ఏసీబీ అధికారులు గురువారం సోమయ్య నివాసం, కార్యాలయంతో పాటు ఆయన బంధువులు, సహచరులకు సంబంధించిన మరో ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ మేరకు ఏసీబీ అధికారికంగా వివరాలు వెల్లడించింది.
సోదాల్లో పలు ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇందులో సూర్యాపేట జిల్లాలో 3 ఎకరాల 3 గుంటల వ్యవసాయ భూమి, సూర్యాపేట, హయత్నగర్ పరిధిలో ఐదు నివాస ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో ఒక జీ+1 భవనం, ఒక జీ+2 భవనం, ఒక జీ+4 భవనం, ఒక పెంట్హౌస్, రెండు గ్రౌండ్ఫ్లోర్ ఇళ్లు ఉన్నాయి. అలాగే సూర్యాపేట పరిధిలో ఎనిమిది ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గుర్తించిన ఆస్తుల మార్కెట్ విలువ అధికారిక విలువ కంటే చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఏసీబీ పేర్కొంది.
బంగారం 709 గ్రాములు.. వెండి 1,750 గ్రాములు
సోదాల్లో రూ.4,63,990 నగదు, బ్యాంకు ఖాతాల్లో రూ.13 లక్షల నిల్వలు గుర్తించారు. అదేవిధంగా 709 గ్రాముల బంగారు ఆభరణాలు, 1,750 గ్రాముల వెండి ఆభరణాలు లభించాయి. వీటి విలువ సుమారు రూ.20 లక్షలుగా అంచనా వేశారు. సోమయ్యకు చెందిన రెండు నాలుగు చక్రాల వాహనాలు, మూడు ద్విచక్ర వాహనాలు కూడా గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.25.20 లక్షలుగా అధికారులు పేర్కొన్నారు. ఇంట్లోని గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల విలువ సుమారు రూ.11 లక్షలుగా అంచనా వేశారు.
ALSO READ : కొండా సురేఖ ఔట్.. ముగ్గురిని వరించిన పదవులు..!
రూ.49 లక్షల గోల్డ్ లోన్
బంగారాన్ని తాకట్టు పెట్టి బ్యాంకు ద్వారా సుమారు రూ.49 లక్షల రుణం పొందినట్లు ఏసీబీ గుర్తించింది. మరిన్ని ఆస్తుల వివరాలపై విచారణ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
ALSO READ : రూ.39.4 కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే యెన్నం శంకుస్థాపన..!
రూ.3.54 కోట్లుగా ఆస్తుల అంచనా
ఇప్పటివరకు గుర్తించిన ఆస్తులు, నగదు, బంగారం, వాహనాలు తదితరాలను కలిపి సోమయ్యకు సంబంధించిన ఆస్తుల మొత్తం విలువను రూ.3,54,36,490గా ఏసీబీ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆదాయ వనరులతో పోలిస్తే ఆస్తుల విలువపై ఏసీబీ అధికారులు మరింత దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం సోమయ్యను హైదరాబాద్లోని ప్రత్యేక ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపరిచి న్యాయ రిమాండ్కు తరలించనున్నట్లు ఏసీబీ వెల్లడించింది. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.










