MLC POLING : ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. 93.55 శాతం పోలింగ్..!
MLC POLING : ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. 93.55 శాతం పోలింగ్..!
నల్లగొండ, మన సాక్షి :
వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్,ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి తెలిపారు.గురువారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన తర్వాత జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల, సెయింట్ అల్పాన్సస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు.
అంతేకాక పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు,పోలింగ్ నమోదు,తదితర విషయాలను పరిశీలించారు.అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా వరంగల్, ఖమ్మం,నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పరిధిలోకి వచ్చే 12 జిల్లాల పోలింగ్ సరళిని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని, ఎలాంటి ఫిర్యాదులు అందలేదని తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో వెబ్ క్యాస్టింగ్ ద్వారా నియోజకవర్గ పరిధిలోకి వచ్చే అన్ని జిల్లాల పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సరళిని సాంకేతికంగా పర్యవేక్షించడం జరిగిందని, సాంకేతికత వల్ల ఇది చాలా సులభం అయిందని తెలిపారు.
తనతో పాటు, అదనపు కలెక్టర్ , ఏఆర్ఓ, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అన్ని జిల్లాల కలెక్టర్లు, వారి ఏ ఆర్ఓలు ఇతర బృందాలు పూర్తిగా సహకారం అందించి సమన్వయంతో పని చేయడం జరిగిందని తెలిపారు.
12 జిల్లాల పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడం తమకు సవాల్ గా ఉన్నప్పటికీ అందరి సహకారంతో ఎన్నికలు పూర్తి చేసినట్లు తెలిపారు.ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సంబంధించి నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న ఆర్జాల బావివద్ద ఉన్న గోదాములో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ,స్ట్రాంగ్ రూమ్ వద్ద ఎస్కార్ట్ ఏర్పాటు, బందోబస్తును ఏర్పాటు చేశామని , మార్చి 3న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరగనుందని ఆమె తెలిపారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ లో భాగంగా నియోజక వర్గ వ్యాప్తంగా ఉదయం 10 గంటలకు 16.78 శాతం ఓట్లు నమోదు కాగా , మధ్యాహ్నం 12 గంటలకు 48.68 శాతం ,2 గంటలకు 76.33 శాతం పోలింగ్ ముగిసే 4 గంటల సమయానికి 93.55 శాతం ఓట్లు నమోదయ్యాయి.
కాగా నల్గొండ జిల్లా వరకు మాత్రమే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ను పరిశీలించినట్లయితే ఉదయం 10 గంటలకు 20.31 శాతం , మధ్యాహ్నం 12 గంటలకు 55.48 శాతం,మధ్యాహ్నం 2 గంటలకు 80.61 శాతం, సాయంత్రం 4 గంటలకు 94.6 శాతం ఓట్లు పోలయ్యాయి.అదనపు కలెక్టర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఏఆర్ఓ జె. శ్రీనివాస్ పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.
పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన ఎస్పీ:
వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నల్గొండ పట్టణ కేంద్రంలోని ఎన్.జి కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సందర్శించారు.
పోలింగ్ కేంద్రాల వద్ద 163 బిఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలు తీరును పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలతో చేసుకోకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించామన్నారు. వారి వెంట డీఎస్పీ శివరాం రెడ్డి, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
Most Read News :









