Karimnagar : కాల్పులు జరిపి బంగారం షోరూమ్ లో చోరీ చేసింది వీరే.. జైల్లో ఉండే ప్లాన్..!
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యోతి నగర్ పీఎంజే జ్యువెలరీ షోరూంలో దోపిడీకి పాల్పడిన దొంగలను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. గురువారం కరీంనగర్ పోలీస్ కమిషనరెట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించి అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమిషనర్ వెల్లడించారు.

Karimnagar : కాల్పులు జరిపి బంగారం షోరూమ్ లో చోరీ చేసింది వీరే.. జైల్లో ఉండే ప్లాన్..!
కరీంనగర్, మనసాక్షి :
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యోతి నగర్ పీఎంజే జ్యువెలరీ షోరూంలో దోపిడీకి పాల్పడిన దొంగలను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. గురువారం కరీంనగర్ పోలీస్ కమిషనరెట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించి అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమిషనర్ వెల్లడించారు.
నిందితులను 12 రోజుల పాటు దోపిడీ దొంగల కేసులో పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు. అరెస్ట్ అయిన దొంగలను రఘునాథ్ కర్మాకర్, రావిష్ కుమార్, మెహతాబ్ ఖాన్గా పోలీసులు తెలిపారు. కరీంనగర్ సిటీలోని పీఎంజే జ్యువెలరీ షోరూంలో మే 3న పట్టపగలే పిస్టల్స్ తో వచ్చిన ఐదుగురు దొంగలు సిబ్బందిపై కాల్పులు జరిపి భారీ దోపిడీకి పాల్పడి సుమారు రూ. 82.02 లక్షల విలువైన 161.4 తులాల బంగారం, 112 క్యారెట్ల వజ్రాలను దోచుకెళ్లారని సీపీ
వివరించారు.
ఈ భారీ దోపిడీ వెనుక బీహార్ జైలులో ఉన్న కుప్రసిద్ధ గ్యాంగ్ స్టార్ట్ ‘ది గోల్డెన్ థీఫ్’ గా పేరుగాంచిన సుబోధ్ సింగ్ హస్తం ఉందని దర్యాప్తులో తేలిందని సీపీ తెలిపారు. జైలు నుంచే అతను ఈ పథకాన్ని రూపొందించాడని వివరించారు. ఈ దోపిడీ కేసును తమ సిబ్బంది ఒక సవాల్ గా తీసుకుని, అత్యంత చాకచక్యంగా ఛేదించారని ఆయన కొనియాడారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జాగీర్ సింగ్ తో పాటు రవీష్ కుమార్, మెహతాబ్ ఖాన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 51 వేల నగదు, 2 మొబైల్ ఫోన్లు, రెండు సిమ్ కార్డులు, మరియు నిందితులు వాడిన నకిలీ ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా సభ్యులు అత్యంత ప్రమాదకరమైన వారని, దోపిడీకి రెండు నెలల ముందే వీరు తెలంగాణకు చేరుకున్నారని సీపీ తెలిపారు.
ఖమ్మం, సిద్ధిపేట, పెద్దపల్లి, కరీంనగర్ వంటి పట్టణాల్లో క్షుణ్ణంగా రెక్కీ నిర్వహించారని, పోలీసులకు చిక్కకుండా నకిలీ బైక్ నంబర్ ప్లేట్లు, నకిలీ గుర్తింపు కార్డులను వాడారని పేర్కొన్నారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితులను పట్టుకోవడానికి, చోరీకి గురైన ఆభరణాలను రికవరీ చేయడానికి 5 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు సీపీ తెలిపారు. త్వరలోనే అందరినీ పట్టుకుని ఆభరణాలను స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు.










