Hyderabad : నెలరోజుల పసికందు కిడ్నాప్.. అపహరణకు పాల్పడిన ముఠా అరెస్ట్..!
లింగంపల్లి రైల్వేస్టేషన్లో కిడ్నాప్నకు గురైన నెల రోజుల చిన్నారిని పోలీసులు సురక్షితంగా రక్షించారు. చందానగర్ పోలీసులు వేగంగా స్పందించి, గాలింపు చర్యలు చేపట్టి చిన్నారిని చాంద్రాయణగుట్టలో స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad : నెలరోజుల పసికందు కిడ్నాప్.. అపహరణకు పాల్పడిన ముఠా అరెస్ట్..!
శేరిలింగంపల్లి, మన సాక్షి :
లింగంపల్లి రైల్వేస్టేషన్లో కిడ్నాప్నకు గురైన నెల రోజుల చిన్నారిని పోలీసులు సురక్షితంగా రక్షించారు. చందానగర్ పోలీసులు వేగంగా స్పందించి, గాలింపు చర్యలు చేపట్టి చిన్నారిని చాంద్రాయణగుట్టలో స్వాధీనం చేసుకున్నారు. లింగంపల్లి పరిసర ప్రాంతాల్లో సర్కస్ చేస్తూ జీవించే దంపతులకు నెల రోజుల ఆడశిశువు ఉంది.
తల్లి పాపతో కలిసి ఫుట్పాత్పై నిద్రిస్తున్న సమయంలో, గుర్తు తెలియని వ్యక్తి చిన్నారిని ఎత్తుకెళ్లాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన చందానగర్ పోలీసులు రైల్వేస్టేషన్ పరిసరాల సీసీటీవీ విజువల్స్ పరిశీలించారు. దుండగుడు ఆటోలో వచ్చి పాపను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. నిందితుడు పాపను కిడ్నాప్ చేసి, చాంద్రాయణగుట్టలో పిల్లలు లేని ఒక దంపతులకు విక్రయించినట్లు పోలీసుల విచారణలో తేలింది.
పోలీసులు చాంద్రాయణగుట్టలో దాడి చేసి పాపను సురక్షితంగా కాపాడారు. కిడ్నాపర్తో పాటు పాపను కొనుగోలు చేసిన వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరుస ఘటనల నేపథ్యంలో రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల వద్ద చిన్న పిల్లల పట్ల తల్లిదండ్రులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.









