ఎరువుల దిగుమతి భారం రైతాంగంపై మోపడం తగదు..!
ఎరువుల ఎగుమతి భారం రైతాంగం పై మోపటం తగదని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి అన్నారు.

ఎరువుల దిగుమతి భారం రైతాంగంపై మోపడం తగదు..!
రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి
సూర్యాపేట, మనసాక్షి :
ఎరువుల ఎగుమతి భారం రైతాంగం పై మోపటం తగదని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో జరిగినతెలంగాణ రైతు సంఘం జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ
ఇప్పటికే పెరుగుతున్న సాగు ఖర్చులతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఎరువుల దిగుమతి రవాణా ఖర్చును రైతులపై మోపడం అత్యంత అన్యాయమని అన్నారు. గతంలో ఈ ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరించేదని, ఇప్పుడు ఒక్కో ఎరువుల బస్తాపై రూ.30 చొప్పున అదనపు భారం విధించడం రైతాంగంపై మరింత ఆర్థిక ఒత్తిడిని పెంచుతుందని విమర్శించారు.
వానాకాలం సాగు సీజన్ను దృష్టిలో ఉంచుకుని రైతులకు అవసరమైన యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు, నాణ్యమైన విత్తనాలు, క్రిమిసంహారక మందులు ఎలాంటి కొరత లేకుండా అందుబాటులో ఉంచాలని కోరారు. మార్కెట్లో కల్తీ విత్తనాలు, నకిలీ పురుగుమందుల విక్రయాలు పెరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
వ్యవసాయానికి నాణ్యమైన, నిరంతర విద్యుత్ అత్యంత అవసరమని, ఎలాంటి కోతలు లేకుండా రైతులకు విద్యుత్ సరఫరా చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న విద్యుత్ సంస్కరణలు రైతాంగ ప్రయోజనాలకు విరుద్ధమని, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నందున ప్రభుత్వం వెంటనే కరువు పరిస్థితులను అంచనా వేసి, అవసరమైన సహాయక చర్యలు ప్రారంభించాలని కోరారు. పంట నష్టాన్ని శాస్త్రీయంగా అంచనా వేసి, నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందించాలని, సాగు కొనసాగించేందుకు అవసరమైన అన్ని రకాల ప్రభుత్వ సహాయాన్ని అందించాలని అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. రైతులపై అదనపు భారాలు మోపే నిర్ణయాలను విరమించి, సాగును లాభసాటిగా మార్చే విధానాలను అమలు చేయాలని ప్రభుత్వాలను విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి జిల్లా ఆఫీస్ బేరర్స్ కో లిశెట్టి యాదగిరిరావు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, కొప్పుల రజిత, దేవరం వెంకటరెడ్డి, షేక్ సైదా తదితరులు పాల్గొన్నారు.









