Miryalaguda : రైతులకు కావలసింది యాగాలు కాదు సాగునీరు.. సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల ఎప్పుడు..!
సాగర్ లో 521 అడుగుల నీరున్నా రైతులకు నీళ్లు విడుదల చేయరా? శ్రీశైలం నీటిని వినియోగించుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు.

Miryalaguda : రైతులకు కావలసింది యాగాలు కాదు సాగునీరు.. సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల ఎప్పుడు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
సాగర్ లో 521 అడుగుల నీరున్నా రైతులకు నీళ్లు విడుదల చేయరా? శ్రీశైలం నీటిని వినియోగించుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని BRS పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు నిర్వహించిన విలేకరుల సమావేశంలో సాగర్ జలాల విడుదల, రైతుల పంటల పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు.
ప్రస్తుతం నాగార్జునసాగర్ డ్యామ్ లో 521 అడుగుల నీటి నిల్వ ఉన్నప్పటికీ, రైతుల పంటలకు అవసరమైన సమయంలో నీటిని విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. గత BRS ప్రభుత్వ హయాంలో నాగార్జునసాగర్లో 518 అడుగుల నీటి మట్టం ఉన్న సమయంలో కూడా రైతుల పంటలను కాపాడేందుకు సాగునీటిని విడుదల చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు.
రైతుల ప్రయోజనాలే ప్రధానంగా పనిచేసిన గత BRS ప్రభుత్వానికి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలు గమనించాలని భాస్కర్ రావు అన్నారు. నీటి లభ్యత, ప్రాజెక్టుల పరిస్థితి, సాగు అవసరాలను శాస్త్రీయంగా అంచనా వేసి రైతులకు ముందుగానే సాగునీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టులో నీటి లభ్యత ఉన్న సమయంలో, రాష్ట్రానికి ఉన్న నీటి వినియోగ హక్కులు, సంబంధిత ఒప్పందాలు మరియు నిబంధనల ప్రకారం నీటిని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. శ్రీశైలంలో కూడా సరిపడా నీరు ఉన్నప్పటికీ, ఆ నీటిని రైతుల అవసరాలకు ఉపయోగించుకునే విషయంలో ప్రభుత్వం సరైన కార్యాచరణ చేపట్టడం లేదని విమర్శించారు.
రైతుల పొలాలకు నీళ్లు అందించాల్సిన ముఖ్యమంత్రి, మంత్రులు సాగునీటి సమస్యపై దృష్టి పెట్టకుండా యాగాలు, పూజలు అంటూ ప్రచార కార్యక్రమాల్లో తిరగడం సరికాదని భాస్కర్ రావు తీవ్రంగా విమర్శించారు. దేవుడిపై భక్తి ఉండటం తప్పు కాదని, అయితే రైతుల పంటలకు నీరు అందించాల్సిన సమయంలో ప్రభుత్వ బాధ్యతను విస్మరించి కేవలం పూజలు, యాగాలతో సమస్య పరిష్కారం కాదని అన్నారు.
“రైతులకు కావాల్సింది యాగాలు కాదు.. సాగునీరు. పూజలు కాదు.. ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల. మాటలు కాదు.. చేతల్లో రైతులకు అండగా నిలిచే ప్రభుత్వం కావాలి” అని భాస్కర్ రావు అన్నారు.
నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోని రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తక్షణమే నీటి పరిస్థితిని సమీక్షించి, అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్ధవంతంగా వినియోగించి పంటలను కాపాడాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రైతులు పంటలు వేసుకుని పెట్టుబడులు పెట్టిన తర్వాత నీటి కోసం ఎదురుచూసే పరిస్థితి రావడం బాధాకరమని, సాగునీటి నిర్వహణలో ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని సూచించారు. నీరు అందుబాటులో ఉన్నప్పటికీ రైతుల పొలాలకు నీరు అందక పంటలు ఎండిపోతే అందుకు పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు హెచ్చరించారు.
కార్యక్రమములో తిప్పన విజయసింహ రెడ్డి, చింతరెడ్డి శ్రీనివాస రెడ్డి, ఎండి. యూసుఫ్, అన్నబీమోజు నాగార్జున చారి, నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, అంగోతు హతిరాం నాయక్, కుందూరు వీరకోటి రెడ్డి, ఎండి. పోయట్, పెండ్యాల పద్మ, కోదాటి రమా, చౌగాని బిక్షం గౌడ్, మాలావత్ రవీందర్ నాయక్, ధీరావత్ పాచు నాయక్, కనిగిరి శ్రీను, కోర్రపిడత లింగా రాజు, రామావత్ వినోద్ నాయక్, వడ్త్య శివ నాయక్ తదితరులు ఉన్నారు.









