CM Revanth Reddy : వనదేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..!
వన దేవతలు సమ్మక్క – సారలమ్మ సన్నిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వితంతువులు, ఒంటరి మహిళలకు చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

CM Revanth Reddy : వనదేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..!
ములుగు, మన సాక్షి :
వన దేవతలు సమ్మక్క – సారలమ్మ సన్నిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వితంతువులు, ఒంటరి మహిళలకు చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ములుగు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి గారు సమ్మక్క – సారలమ్మ గద్దెలను దర్శించుకున్నారు.
ప్రత్యేక పూజా కార్యక్రమం మొక్కులో భాగంగా సమ్మక్క సారలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించారు. ఆలయం ప్రాంగణంలో మొక్కను నాటారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా గిరిజన పూజారులు డోలు వాయిద్యాలు, గిరిజన సంప్రదాయాల నడుమ ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం స్థానికంగా అర్హులైన వితంతు, ఒంటరి మహిళలకు పింఛన్లను పంపిణీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసే కార్యక్రమానికి లాంఛనంగా శ్రీకారం చుట్టారు. మేడారానికి వచ్చే భక్తుల దాహార్తిని తీర్చేందుకు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తాగునీటి ప్లాంట్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. భక్తులకు పరిశుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉండేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను సూచించారు.
ఆలయ ప్రాంగణంలో స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. మహిళా సంఘాలు చేపడుతున్న కార్యక్రమాలు, వారి ఉపాధి, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు దనసరి అనసూయ సీతక్క , పొంగులేటి శ్రీనివాస రెడ్డి , అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , విప్ రామచంద్ర నాయక్ , ఎంపీలు వేం నరేందర్ రెడ్డి , పోరిక బలరాం నాయక్ , కడియం కావ్య,, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి , గండ్ర సత్యనారాయణ రావు, నాయని రాజేందర్ రెడ్డి, కోరం కనకయ్య , పాయం వెంకటేశ్వర్లు , తెల్లం వెంకట్రావు , జారే ఆదినారాయణ , మురళి నాయక్ , ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.










