విద్యాలయాలు సరస్వతి నిలయాలు
విద్యాలయాలు సరస్వతి నిలయాలు
-తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు
చౌటుప్పల్, మన సాక్షి.
చౌటుప్పల్ పురపాలక కేంద్రంలోని మై చోటా పాఠశాలలో ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమమును శనివారం రాత్రి పాఠశాల ఆవరణంలో పాఠశాల చైర్మన్ బాలసన్ని రెడ్డి, పాఠశాల డైరెక్టర్ క్రాంతిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు తరగతి గది సరస్వతి నిలయం అని, గురువు అన్నితానై విద్యార్థుల భవిష్యత్తు పునాది వేస్తాడని అట్టి గురువును విద్యార్థులు తప్పక గౌరవించాలని అన్నారు.
ఈరోజు ప్రపంచాన్ని పరిచయం చేసేది కేవలం డబ్బు మాత్రమే కాదని విద్య అనే విషయాన్ని గుర్తించాలని ఈ విషయాన్ని తమ పిల్లలకు తల్లిదండ్రులు నేర్పించాలని అన్నారు. పాఠశాల అన్ని వసతుతో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అతి తక్కువ కాలంలో తల్లిదండ్రుల ఆదరణను పాఠశాల పొందడం గర్వించదగ్గ విషయమని అన్నారు.
విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని అన్నారు. తల్లిదండ్రులు విద్యార్థుల ప్రవర్తన పట్ల, చదువుల పట్ల అత్యంత శ్రద్ధ కనబరచాలని అన్నారు.
అంతేకాకుండా విద్యార్థులకు ఇష్టమైన చదువును చదువుకునే అవకాశం విద్యార్థికి కల్పించాలని తల్లిదండ్రులను కోరారు. ఉపాధ్యాయులు కూడా చిత్తశుద్ధితో, ఆదర్శవంతంగా ప్రవర్తిస్తూ బోధనకు అంకితం అవ్వాలని సూచించారు.
విద్యార్థుల్లో దేశభక్తి, ఏకాగ్రత, సచ్చీలత, సహనం చిన్ననాటి నుండి అలవాడేలా ఉపాధ్యాయులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించినట్లయితే దేశం అక్షర జ్యోతిగా వెలిగి అభివృద్ధి బాటలో పయనిస్తుందని, విద్య అంటే జ్ఞానం, క్రమశిక్షణ, సక్రమమైన ప్రవర్తనని కలిగి ఉండటం అని విద్యార్థులకు తెలిపారు.
ముఖ్యంగా తల్లిదండ్రులు విద్యార్థులను చరవాణిలకు దూరంగా ఉంచాలని, వారిని ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూ ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల తరఫున నిర్వహించిన చౌటుప్పల్ ఇంటర్ స్కూల్ టాలెంట్ టెస్ట్ లో గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్ ను, నగదు బహుమతిని తన చేతుల మీదుగా అందజేశారు.
విద్యార్థులు తమ సాంస్కృతిక కార్యక్రమాలతో హంగామా చేశారు .అనంతరం పాఠశాల వ్యవస్థాపకులు బాలసన్నీ రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాల ప్రథమ వార్షికోత్సవానికి హాజరైన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అతిథులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సరైన విద్య, క్రమశిక్షణ, సంస్కృతిని భావితారాలకు నేర్పటమే తమ పాఠశాల ముఖ్య ఉద్దేశమని అన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ తల్లిదండ్రుల ఆశలు వమ్ము కాకుండా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీలు జ్యోతి, వాసంతి, ప్రియాంక, శ్రావణి, దివ్య, నిఖిత, స్థానికులు సాయన సుబ్రహ్మణ్యం నాయుడు, ప్రభాకర్ రెడ్డి, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.









