Narayanpet : జిల్లా కలెక్టర్ కీలక సూచన.. సంక్షేమ వసతి గృహాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి..!
వసతి గృహాలను వార్డెన్లు తమ ఇంటిలా భావించాలనీ అక్కడ ఉండే విద్యార్థినీ విద్యార్థులను సొంత పిల్లలలా చూసుకోవాలి. వంద శాతం కచ్చితమైన మెనూ ప్రకారం విద్యార్థులకు అల్పాహారం, భోజనం, స్నాక్స్ అందించాలి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాలలో మౌలిక వసతి సదుపాయాల కల్పన కు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు.

Narayanpet : జిల్లా కలెక్టర్ కీలక సూచన.. సంక్షేమ వసతి గృహాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి..!
నారాయణపేట టౌన్, మన సాక్షి :
వసతి గృహాలను వార్డెన్లు తమ ఇంటిలా భావించాలనీ అక్కడ ఉండే విద్యార్థినీ విద్యార్థులను సొంత పిల్లలలా చూసుకోవాలి. వంద శాతం కచ్చితమైన మెనూ ప్రకారం విద్యార్థులకు అల్పాహారం, భోజనం, స్నాక్స్ అందించాలి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాలలో మౌలిక వసతి సదుపాయాల కల్పన కు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు.
శనివారం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో జిల్లాలోని ఎస్సీ ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల వార్డెన్ల ( హెచ్ డబ్ల్యు ఓ)తో కలెక్టర్ సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని, ప్రభుత్వ పరంగా వచ్చే ప్రతిదీ వారికి అందించడం మన బాధ్యత, వృత్తి ధర్మం అని కలెక్టర్ తెలిపారు. ప్రతీ వసతి గృహంలో విద్యార్థులకు సరిపడా నీళ్ళు, విద్యుత్, ఫ్యాన్లు, మరుగుదొడ్లు, వెలుతురు ఉండాలన్నారు. ముఖ్యంగా బాలికల వసతి గృహాలలో మరుగుదొడ్లు, స్నానపు గదులు తగినన్ని ఉండాలని తెలిపారు.
వసతి గృహాలలో మెనూ అమలు కావడం లేదనే ఫిర్యాదులు తన దృష్టికి వచ్చాయని, ఇకపై అలాంటి ఫిర్యాదులు రాకుండా లేకుండా వంద శాతం మెనూ అమలు చేయాలని కలెక్టర్ తేల్చి చెప్పారు. ఇతర జిల్లాల్లో( వికారాబాద్, మరి కొన్ని జిల్లాలు) మెనూ అమలు చేస్తున్నారని, మరి మన జిల్లాలో ఎందుకు అమలు చేయడం లేదని వార్డెన్ల ను ఆయన ప్రశ్నించారు.
వర్కర్లు లేరని, సరుకులు సరిపోవడం లేదని, అవసరమైన సామాగ్రి లేదనే కారణాలు చెప్పకుండా మెనూ ప్రకారం విద్యార్థులకు అల్పాహారం భోజనం స్నాక్స్ ఇవ్వాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థుల మెనూ విషయంలో తాను కాంప్రమైజ్ కానని సూటిగా చెప్పారు. తాను వికారాబాద్ జిల్లాలోని ప్రతీ వసతి గృహాన్ని సందర్శించానని, ఆయా వసతి గృహాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేసి నాణ్యతను పరిశీలించానని సమావేశంలో కలెక్టర్ గుర్తు చేశారు.
తాను వికారాబాద్ జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలలో కల్పించిన వసతి సదుపాయాల బిఫోర్ / ఆఫ్టర్ చిత్ర మాలికలను సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వార్డెన్లకు చూపించారు.ముందుగా సొంత భవనాలలో కొనసాగుతున్న వసతి గృహాలలో చేయాల్సిన మరమ్మతు పనుల కోసం స్థానికంగా ఉండే తాపీ మేస్త్రీలు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్ల ను పిలిపించి ఎంత వ్యయం అవుతుందో ప్రతిపాదనలు తయారు చేసి నెక్స్ట్ సమావేశం నాటికి తీసుకురావాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్సీ ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖ అధికారి అబ్దుల్ ఖలీల్, ఏఎస్ డబ్లుఓ పరమేశ్, జిల్లాలోని ఆయా వసతి గృహాల వార్డెన్లు పాల్గొన్నారు.









