సర్పంచ్ స్థానంలో భర్త జోక్యంపై కదిలిన జాతీయ మహిళా కమిషన్.. కరీంనగర్ కలెక్టర్ విచారణకు ఆదేశం..!
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్పూర్ గ్రామంలో ప్రభుత్వ నిధులతో చేపట్టిన అధికారిక అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధి అయిన మహిళా సర్పంచ్ స్థానంలో ఆమె భర్త ప్రాతినిధ్యం వహించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

సర్పంచ్ స్థానంలో భర్త జోక్యంపై కదిలిన జాతీయ మహిళా కమిషన్.. కరీంనగర్ కలెక్టర్ విచారణకు ఆదేశం..!
కరీంనగర్, మనసాక్షి :
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్పూర్ గ్రామంలో ప్రభుత్వ నిధులతో చేపట్టిన అధికారిక అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధి అయిన మహిళా సర్పంచ్ స్థానంలో ఆమె భర్త ప్రాతినిధ్యం వహించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గ్రామ సర్పంచ్ పాల్గొనాల్సిన అధికారిక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాల్లో ఆమెకు బదులుగా భర్త పాల్గొని ప్రారంభించడంపై గ్రామంలోనూ, సోషల్ మీడియా వేదికగానూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ఎన్నికైన మహిళా ప్రజాప్రతినిధి స్థానంలో భర్త అధికారిక కార్యక్రమాల్లో జోక్యం చేసుకోవడం మహిళా సాధికారతకు, ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ వద్ద ఫిర్యాదు నమోదు కావడంతో కేంద్ర, రాష్ట్ర స్థాయి యంత్రాంగం వేగంగా స్పందించింది.
ప్రజాప్రతినిధులుగా గెలిచిన మహిళల హక్కులను, అధికారాలను ఇతరులు చెలాయించడం చట్టరీత్యా చెల్లుబాటు కాదని, ఇది రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కలిగించడమేనని కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి తక్షణమే నివేదిక సమర్పించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ను జాతీయ మహిళా కమిషన్ ఆదేశించడంతో, జిల్లా యంత్రాంగం దర్యాప్తుకు శ్రీకారం చుట్టింది.
ఈ నేపథ్యంలో, ఎన్నికైన మహిళా ప్రజాప్రతినిధులు స్వేచ్ఛగా, స్వతంత్రంగా బాధ్యతలు నిర్వర్తించేలా చూడాలని, ఇటువంటి భర్త లేదా కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్న ‘ప్రాక్సీ పాలన’ ఘటనలపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు మహిళా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.









