మిర్యాలగూడ : మిల్లర్లకు అదనపు కలెక్టర్ సీరియస్ వార్నింగ్
మిర్యాలగూడ : మిల్లర్లకు అదనపు కలెక్టర్ సీరియస్ వార్నింగ్
ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
మిర్యాలగూడ , మనసాక్షి :
కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం ఎగుమతి, దిగుమతుల్లో మిల్లర్లు లారీ డ్రైవర్లు అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని అవంతిపురం మార్కెట్ యార్డులో ఉన్న పిఎసిఎస్ కొనుగోలు కేంద్రాన్ని, దామరచర్ల మండలంలోని బెట్టు తండా ఐకేపీ కేంద్రాన్ని ఆయన డీఎస్ఓ వెంకటేశ్వర్లతో కలిసి సందర్శించి ధాన్యాన్ని పరిశీలించారు.
మార్కెట్ యార్డ్ కార్యాలయంలో మిల్లర్లు లారీ డ్రైవర్లతో సమావేశం నిర్వహించి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్న కారణంగా ఎప్పటికప్పుడు ధాన్యాన్ని కొనుగోలు చేసి కాంటావేసి గన్ని సంచుల్లో నింపి ఎగుమతి కోసం సిద్ధంగా ఉంచాలన్నారు. కేంద్రాలలో ధాన్యపు బస్తాలు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు లారీల్లో ఎగుమతి చేయాలన్నారు. డబ్బులు ఇస్తేనే లోడ్లను ఎత్తడం సరైనది కాదని అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రతిరోజు పతి కొనుగోలు కేంద్రానికి 3 లారీలు పెట్టాలని కాంట్రాక్టర్ కు సూచించారు ప్రతి రైస్ మిల్లు తప్పనిసరిగా ప్రతిరోజు 10 నుంచి 12 లారీల ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలని ఆదేశించారు. ధాన్యం దిగుమతి చేసుకోవడంలో అలసత్యం వహించవద్దని సూచించారు. కొనుగోలు కేంద్రాలలో అకాల వర్షాల వల్ల తడిసిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
రైతులు అధైర్య పడొద్దని కేంద్రాలకు వచ్చిన ప్రతి దాన్యపు గింజను తప్పనిసరి కొనుగోలు చేస్తామని చెప్పారు. నాణ్యత విషయంలో రైతులు నిబంధనలను పాటించాలని సూచించారు . ఈ కార్యక్రమంలో తాసిల్దార్లు అనిల్ కుమార్, గణేష్, ఆలగడప పిఎసిఎస్ చైర్మన్ రామకృష్ణ, మార్కెట్ కార్యదర్శి శ్రీధర్ ,సివిల్ సప్లై ఆర్ఐ సురేందర్ సింగ్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.










