అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య..!
అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ పిజ్జా డెలివరీ కి వెళ్ళిన సమయంలో ఈ విషాద సంఘటన జరిగింది.

అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ పిజ్జా డెలివరీ కి వెళ్ళిన సమయంలో ఈ విషాద సంఘటన జరిగింది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు.. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గుండ్ల పోచంపల్లి గ్రామానికి చెందిన కుంచ శ్రీనివాస్, నీలిమ కుమారుడు అన్షుల్ (28) ఉన్నత భవిష్యత్తు కోసం 2023 లో అమెరికా వెళ్లారు.
అక్కడ నార్త్ ఫీలడెలిఫియాలో నివాసం ఉంటూ KWC అనే సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. అయితే వారాంతంలో అదనపు సంపాదన కోసం పిజ్జా డెలివరీ బాయ్ గా కూడా పనిచేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెడ్ గ్లీ స్ట్రీట్ లోని రేమండ్ రోజెస్ హోమ్స్ పరిధిలో ఉన్న ఒక నిర్మానుష ప్రాంతం నుంచి మూడు పిజ్జాల ఆర్డర్ వచ్చింది. వాహనంలో అక్కడికి వెళ్లారు. అతడు కారు దిగి ఇంటి ప్రాంగణంలోకి అడుగు పెడుతుండగానే ముఖాలకు మాస్కులు ధరించిన కొందరు గుర్తుతెలియని దుండగులు దాడి చేసి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో అన్షుల్ తల వెనుక భాగంలో బుల్లెట్ తీగడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత అటుగా వెళ్లిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ హత్య దోపిడీ దొంగతనం వల్ల జరిగిందా..? లేక మర్యాదైనా కారణం వల్ల జరిగిందా..? అనే విషయంపై అమెరికా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమకు అండగా ఉంటాడని అనుకున్న కొడుకు విగత జీవిగా మారడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు. అన్షుల్ మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి రప్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి సహాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు.









