Nalgonda : ఈ ముఠా మామూలోల్లు కాదు.. అమాయక ప్రజలే వారి టార్గెట్..!

Nalgonda : ఈ ముఠా మామూలోల్లు కాదు.. అమాయక ప్రజలే వారి టార్గెట్..!
దేవరకొండ, మనసాక్షి :
నల్లగొండ జిల్లాలో అధిక వడ్డీ ఆశ చూపి అమాయక ప్రజల వద్ద నుండి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసగించిన కేసులో నలుగురు ప్రధాన ఏజెంట్లను అరెస్టు చేసినట్లు దేవరకొండ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) మౌనిక తెలిపారు. శుక్రవారం దేవరకొండ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె కేసు వివరాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఏఎస్పీ మౌనిక మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా నల్గొండ జిల్లాలో ‘అధిక వడ్డీ’ పేరుతో ప్రజలను ఆకర్షించి వారి కష్టార్జితాన్ని కొల్లగొడుతున్న ముఠాపై మేము దృష్టి పెట్టాము అన్నారు. ప్రధాన నిందితుడు రామవత్ బాలాజీ నాయక్ను ఇప్పటికే అరెస్టు చేయడం జరిగింది. శుక్రవారం ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన నలుగురు ఏజెంట్లను అరెస్టు చేసి వారి వద్ద నుండి కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నాము అని ఏఎస్పీ మౌనిక మీడియాకు వివరించారు.
అరెస్ట్ అయిన నిందితులు నలుగురూ నల్గొండ జిల్లా వద్దపట్ల పి.ఏ. పల్లి మండలం, పలుగుతండ గ్రామానికి చచెందిన వారిలో హేమంత్, రమేష్ నాయక్, రామవత్ సురేష్, రామావత్ వినోద్ ఉన్నారు.
నిందితులు బాలాజీ నాయక్ నేతృత్వంలో ఆర్ బి ఎన్ సాఫ్ట్వేర్ కంపెనీ పేరు చెప్పి అధిక వడ్డీ ఆశను చూపించారు. ముఖ్యంగా ఖరీదైన కార్లలో తిరగడం లగ్జరీ ఇళ్లు, బంగారు ఆభరణాలు బహిరంగంగా ప్రదర్శించడం ద్వారా ప్రజలను ఆకర్షించారు. తమలాగే విలాసవంతమైన జీవితాలు గడపవచ్చని మాయమాటలు చెప్పి మొదట వడ్డీ సక్రమంగా చెల్లించి మరింత మందిని ఈ మోసపు వలలోకి లాగారు.
అధిక మొత్తంలో డబ్బులు పోగైన తర్వాత పారిపోవాలని వీరు ప్లాన్ చేసుకున్నారు. వీరిపై గుడిపల్లి పోలీస్ స్టేషన్లో సంబంధిత సెక్షన్ల కింద ముఖ్యంగా సెక్షన్ 5 ఆఫ్ టీఎస్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1999 కింద కేసులు నమోదు చేయబడ్డాయి అని ఏఎస్పీ స్పష్టం చేశారు.
దర్యాప్తులో భాగంగా ఈ ఏజెంట్లు అక్రమంగా సంపాదించిన సొమ్ముతో కొనుగోలు చేసిన ఆస్తులను సీజ్ చేసినట్లు ఏఎస్పి మౌనిక తెలిపారు. మొత్తం ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను సీజ్ చేశామని వాటిలో ప్రధానంగా కొండమల్లేపల్లి, మిర్యాలగూడ ప్రాంతాలలో ఇళ్లు, ఇళ్ల స్థలాలు, భూములు ఉన్నాయి. వీటి విలువ కోట్లలో ఉంది అన్నారు. ఫార్చునర్, ఇన్నోవా క్రిష్ట, రెనాల్డ్ ట్రైబర్ వంటి ఖరీదైన కార్లు, దాదాపు 50 తులాలకు పైగా బంగారు ఆభరణాలు, విలువైన సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
చివరిగా ఏఎస్పీ మౌనిక జిల్లా ప్రజలకు ప్రత్యేకంగా బాధితులకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. జిల్లా ప్రజలందరూ అధిక వడ్డీ వ్యాపారాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నారు. సులభంగా డబ్బు సంపాదించవచ్చనే అత్యాశతో ఇటువంటి మోసపూరిత పథకాలలో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దు అన్నారు. మేము తీసుకున్న చర్యల కారణంగా ఎవరూ కూడా ఆందోళన చెందవద్దు.
లేదా వత్తిడికి లోనై తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు అన్నారు. బాధితులు ఎవరైనా ఉంటే వారు మధ్యవర్తులను నమ్మి మోసపోకుండా వెంటనే వారి వద్ద ఉన్న అన్ని పత్రాలతో (డబ్బు ఇచ్చిన రసీదులు, పత్రాలు) నేరుగా గుడిపల్లి పోలీస్ స్టేషన్ను సంప్రదించి కేసులు నమోదు చేసుకోవాలి అన్నారు.
చట్టపరంగా వారికి న్యాయం జరిగేలా అక్రమంగా సంపాదించిన ఈ ఆస్తులను చట్టబద్ధంగా వారికి తిరిగి ఇప్పించేందుకు మా వంతు కృషి చేస్తాము అన్నారు. జిల్లాలో ఇటువంటి మోసాలను ఉపేక్షించేది లేదు అని ఏఎస్పి మౌనిక గట్టిగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొండమల్లేపల్లి సిఐ నవీన్, కొండమల్లేపల్లి ఎస్సై అజ్మీరా రమేష్, గుడిపల్లి ఎస్సై నర్సింహులు, గుర్రంపొడ్ ఎస్సై మధు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
MOST READ :
-
Khammam : హోటళ్లు, వ్యాపార సంస్థలో ఆకస్మిక దాడులు.. జరిమానా..!
-
Suryapet : మహిళలకు భారీ శుభవార్త.. ఉచితంగా మగ్గం వర్క్స్ శిక్షణ..!
-
Suryapet : మహిళలకు భారీ శుభవార్త.. ఉచితంగా మగ్గం వర్క్స్ శిక్షణ..!
-
Gold Price : బంగారం ధర తగ్గుతుందా.. ఈరోజు తులం ఎంతంటే..!
-
Gold Price : ఒక్క రోజులోనే ఆల్ టైం రికార్డుకు చేరిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!










