Miryalaguda : సంగం డైరీ ఎదుట స్థానికుల ఆందోళన.. కోదాడ – జడ్చర్ల హైవేపై భారీగా నిలిచిన వాహనాలు..!
Miryalaguda : సంగం డైరీ ఎదుట స్థానికుల ఆందోళన.. కోదాడ – జడ్చర్ల హైవేపై భారీగా నిలిచిన వాహనాలు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని శ్రీనివాస్ నగర్ సమీపంలో ఉన్న సంగం డైరీ ఎదుట సోమవారం స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. శ్రీనివాస్ నగర్ తాజా మాజీ ఎంపీటీసీ ఇస్లావత్ సుజాత బాలు నాయక్ ఆధ్వర్యంలో శ్రీనివాస్ నగర్, సామ్య తండా, తుంగపహాడ్, దూద్య తండ, ధీరవత్ తండాకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున డైరీ ఎదుట చేరుకొని ఫ్యాక్టరీ ఎత్తివేయాలంటూ నినాదాలు చేశారు.
ఉద్యోగులు లోనికి వెళ్లకుండా గేట్లు వేసి అడ్డుకున్నారు. అనంతరం కోదాడ – జడ్చర్ల హైవే పై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఫ్యాక్టరీలో విషపూరిత వ్యర్ధాలు బయటికి వదులుతున్నారని ఆరోపించారు. డైరీ కి అనుబంధంగా సామ్య తండా సమీపంలో ఏర్పాటు చేసిన ఈ టి పి ప్లాంట్ కు విపరీతంగా వ్యర్ధాలు చేరుకోవటంతో భరించలేని దుర్గంధం వెదజల్లుతుందని అన్నారు.
కర్మాగారానికి సమీపంలోనే గ్రీన్ సిటీ వెంచర్, తెలంగాణ ఆదర్శ పాఠశాల ఉన్నాయని కర్మాగారం కాలుష్యం వలన ప్రజలు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సమీప ప్రజలకు, ఫిర్యాదుదారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే గుట్టుచప్పుడుగా అధికారులతో తనిఖీలు నిర్వహించి అధికారులు తమకు అనుకూలంగా రిపోర్టులు తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించుకున్నారని ఆరోపించారు.
స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన పరిశ్రమ వారు ఒకరికి ఉపాధి కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తుల ఆందోళనలతో రహదారిపై భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానంద రెడ్డి, మచ్చ వెంకన్న, సురేష్, వెంకట్ రెడ్డి, ఆంజనేయులు, శేఖర్ రెడ్డి, బలరాం,సూర్యం తదితరులు పాల్గొన్నారు.
MOST READ :









