Double Bed Room Houses : డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని ఆందోళన.. అరెస్టు చేసిన పోలీసులు..!
Double Bed Room Houses : డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని ఆందోళన.. అరెస్టు చేసిన పోలీసులు..!
సూర్యాపేట, మనసాక్షి :
తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లకు అర్హులైన లబ్దిదారులను గుర్తించి పట్టాలిస్తే వారికి అధికారులు ప్లాట్లు అలాట్మెంట్ చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని తమకు వెంటనే అలాట్మెంట్లు చేయాలని డిమాండ్ చేస్తూ డబుల్ బెడ్రూం లబ్దిదారుల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించి కొత్తబస్టాండ్ వద్ద బైటాయించి ధర్నాకు దిగారు.
ఈ సందర్భంగా డబుల్ బెడ్రూం లబ్దిదారుల కమిటీ అధ్యక్షులు షేక్ నయిమ్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం అర్హులైన 804మందికి డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయిస్తూ పట్టాలిచ్చి పది నెలలు గడుస్తున్నా అధికారులు నేటికి మాకు అలాట్మెంట్లు చేయడం లేదన్నారు. ఈ విషయమై మూడు నెలల కిందట జిల్లా కలెక్టర్ ను కలసి విన్నవిస్తే కొన్ని నిర్మాణ పనులు మిగిలి ఉన్నాయని అవి పూర్తి చేసి ఇస్తామని చెప్పి ఆరు నెలలు అవుతున్నా నేటికి ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నారు.
లబ్దిదారులంతా నిరుపేదలని సొంత ఇండ్లు లేక అద్దెలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు కొందరు పాత ఇండ్లలో ఉంటూ అవి కూలి పోవడంతో నిరశ్రయలుగా మారారని అన్నారు. అర్హులైన నిరుపేదలకు పట్టాలు ఇచ్చి అలాట్మెంట్లు ఎందుకు చేయడం లేదని ముఖ్యమంత్రి, మంత్రులను ప్రశ్నించారు.
లబ్దిదారులంతా పార్టీలకతీతంగా ఉన్నారని వెంటనే ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తమకు డబుల్ బెడ్రూం ఇండ్లు అలాట్మెంట్ చేసి న్యాయం చేయాలని లేని పక్షంలో ఆత్మహత్యలు చేసుకునేందుకు కూడా మేము వెనుకాడబోమన్నారు.
రెండు రోజుల్లో మా ఇండ్లు మాకు అలాట్మెంట్ ఇవ్వని పక్షంలో మూడోరోజు మేమే తాళాలు పగలగొట్టి గృహప్రవేశాలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం పోలీసులు కలుగచేసుకొని ధర్నా నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకొని పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ కార్యక్రమంలో డబుల్ బెడ్రూం లబ్దిదారుల కమిటీ సభ్యులు ఎం.డి.రఫీ, రాచకొండ ఉపేందర్, దుబ్బ సైదులు, మెగావత్ రవినాయక్, ఎస్.కె. నసీర్ బాబా, గుండా వెంకన్న, ఎస్.కె.ఆశా, ఎస్.కె. హుస్సేన్బీ, కమ్మలపల్లి నీలమ్మ, కాటూరి భిక్ష్మమ్మ, ఎస్.కె. హాసినా, అండెం శారద, రామిని, బానోతు నాగమణి, మోరం నగేష్, నూకల నాగ రాజులతో పాటు దివ్యాంగ సభ్యులు పాల్గొన్నారు.
LATEST UPDATE :









