Huzurnagar : కృష్ణా జలాలతో హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తా.. మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి..!

Huzurnagar : కృష్ణా జలాలతో హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తా.. మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి..!
హుజుర్నగర్, మనసాక్షి
చింతలపాలెం మండలం పాత వెల్లటూరు వద్ద 1648 కోట్ల రూపాయలతో 53000 ఎకరాలకు నీరు అందించే మహాత్మా గాంధీ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులను గురువారం రాష్ట్ర నీటిపారుదల మరియు ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు.
ముందుగా మంత్రి అండర్ గ్రౌండ్ నందు పంపు హౌస్ పనులను పరిశీలించి పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. తదుపరి సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ కృష్ణా నది మీద నిర్మిస్తున్న మహాత్మా గాంధీ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మొత్తం ఖర్చు 1,648 కోట్లు కాగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ 16 మెగా వాట్ల 4 మోటార్ల ద్వారా నీటిని పంపింగ్ చేయడం ద్వారా మట్టంపల్లి మండలంలో 9 గ్రామాలలో 20,466 ఎకరాలకు,
మేళ్లచెరువు మండలంలో 5 గ్రామాలలో 15,829 ఎకరాలకు, చింతలపాలెం మండలంలో 9 గ్రామాలలో 16705 ఎకరాలకు మొత్తం 53000 ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుందని దీని ద్వారా 5,080 ఎస్ టి , 3540 ఎస్ సి, 8470 బి సి, 2205 ఓ సి కుటుంబాలు మొత్తంగా 19,295 కుటుంబాలు లబ్ధి పొందుతాయని దీని కొరకు 191 ఎకరాల రైతుల భూములను కొనుగోలు చేసి వారికి నష్టపరిహారంగా 60 కోట్లు చెల్లించడం జరిగినదని తెలిపారు.
నాగార్జునసాగర్లో నీటి లభ్యత తక్కువగా ఉన్న సమయంలో పులిచింతల ప్రాజెక్టు బ్యాక్వాటర్ను వినియోగించుకుని ఈ ప్రాంతంలోని గ్రామాలను సస్యశ్యామలం చేయనున్నట్లు తెలిపారు. డిసెంబర్ నాటికీ ప్రాజెక్టు రూఫ్ టాప్ లెవెల్, పంప్ హౌస్ పనులు పూర్తి అవుతాయని వీలైనంత తొందరగా ప్రాజెక్టు పనులు పూర్తి చేసి సాగునీరు అందించాలని
మంత్రి గుత్తందారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ కె. నరసింహ, ఇరిగేషన్ సీఈ నాగభూషణం, ఆర్డీవో శ్రీనివాసులు, మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, , అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.









