Nalgonda : భార్య చనిపోయిన చోటనే బ్రిడ్జిపై నుంచి దూకి భర్త ఆత్మహత్యా యత్నం..!
ఆమె లేని జీవితం నాకు వృధా.. నేను ఆమె వద్దకే పోతాను" అంటూ రోడ్డు ప్రమాదంలో భార్య చనిపోయిన చోటనే ఓ భర్త బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించిన విషాద సంఘటన మండల కేంద్రంలో జరిగింది.

Nalgonda : భార్య చనిపోయిన చోటనే బ్రిడ్జిపై నుంచి దూకి భర్త ఆత్మహత్యా యత్నం..!
గుర్రంపోడు, మన సాక్షి :
ఆమె లేని జీవితం నాకు వృధా.. నేను ఆమె వద్దకే పోతాను” అంటూ రోడ్డు ప్రమాదంలో భార్య చనిపోయిన చోటనే ఓ భర్త బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించిన విషాద సంఘటన మండల కేంద్రంలో జరిగింది. ప్రత్యక్ష సాక్షులు మరియు స్థానికుల కథనం ప్రకారం..
మండలంలోని చామలేడు గ్రామానికి చెందిన శిలువేరు నవీన్ వయసు 25 సంవత్సరాలు అనే యువకుడు గుర్రంపోడు శివారున నల్లగొండ – దేవరకొండ ప్రధాన రహదారిపై ఉన్న శశిలేటి వాగు బ్రిడ్జిపైకి సాయంత్రం చేరుకున్నాడు. అక్కడి నుంచి ఒక్కసారిగా కిందకు దూకేశాడు. సుమారు 30 ఫీట్ల లోతు గల బ్రిడ్జి దిగువన ఉన్న ఇసుకలో పడటంతో నవీన్కు తీవ్ర గాయాలయ్యాయి.
దీనిని గమనించిన స్థానికులు వెంటనే 108 అత్యవసర వాహనానికి సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన నవీన్ను చికిత్స నిమిత్తం నల్లగొండ ఆసుపత్రికి తరలించారు. ఎత్తు నుంచి పడటంతో అతడి నడుము భాగానికి తీవ్ర గాయమైందని, ప్రస్తుతం ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని సమాచారం.
కళ్లముందే చనిపోయిన భార్య.. గత ఏడాది ఆగష్టు 29న ఇదే బ్రిడ్జిపై నవీన్ తన భార్య అనూషతో కలిసి బైక్పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అనూష అదుపుతప్పి బ్రిడ్జి రెయిలింగ్పై నుంచి కింద ఉన్న వాగులోని నీటి గుంతలో పడి మృతి చెందింది. ఆ ప్రమాదంలో నవీన్ తలకు కూడా తీవ్ర గాయాలవడంతో హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నాడు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న కేవలం పది రోజులకే భార్య తన కళ్లముందే ప్రమాదంలో చనిపోవడంతో నవీన్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. 108 వాహనంలో ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో.. తన భార్య లేని జీవితం వ్యర్థమని, తాను చనిపోయి ఆమె వద్దకే వెళ్తానంటూ అతడు రోదించిన తీరు అక్కడ ఉన్న వారిని తీవ్రంగా కలచివేసింది.









