BRS : మిర్యాలగూడలో కేటీఆర్ రైతు ర్యాలీకి పోలీసుల అనుమతి నిరాకరణ..!
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన రైతు ర్యాలీ, బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు.

BRS : మిర్యాలగూడలో కేటీఆర్ రైతు ర్యాలీకి పోలీసుల అనుమతి నిరాకరణ..!
మన సాక్షి, మిర్యాలగూడ:
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన రైతు ర్యాలీ, బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ప్రధానంగా శాంతి భద్రతలు, ట్రాఫిక్ సమస్యల కారణంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనే ర్యాలీ, సభలకు అనుమతిని నిరాకరించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఈనెల మూడవ తేదీన బిఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు ర్యాలీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.
మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఫ్లైఓవర్ బ్రిడ్జి నుండి రాజీవ్ చౌక్ వరకు రైతు ర్యాలీ నిర్వహించడంతో పాటు రాజీవ్ చౌక్ వద్ద బహిరంగ సభ నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ భారీ ర్యాలీలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాల్గొననున్నారు.
కాగా అందుకు అనుమతి కోరుతూ మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు పోలీసులకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. వ్యవసాయ రంగం, సాగునీరు, విద్యుత్తు, యూరియా కొరత, రైతు భరోసా తదితర అంశాలపై రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు దరఖాస్తులో పేర్కొన్నారు. కాగా రైతు ర్యాలీ బహిరంగ సభ పై వివిధ కారణాలతో అనుమతిని నిరాకరిస్తున్నట్లు పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు.
రాజీవ్ చౌక్ ప్రధాన కూడలి కావడంతో పాటు కోదాడ – జడ్చర్ల కలిపే జాతీయ రహదారి ఉందని, ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుందని, వాహనాల పార్కింగ్ కి సరిపడా స్థలం లేదని, వాహనాలు నిలిపితే ట్రాఫిక్ సమస్య మరింతగా తీవ్రమయ్యే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. రాజీవ్ చౌక్ పరిసరాల్లో ప్రభుత్వ, ఇతర ముఖ్య కార్యాలయాలు ఉన్నందున ఇబ్బందులు కలగవచ్చునని పోలీసులు పేర్కొన్నారు.
ర్యాలీకి, సభకు అనుమతిస్తే ప్రజలకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అనుమతిని నిరాకరిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఇతర ప్రాంతాల్లో ఫంక్షన్ హాల్లో గాని ఖాళీ స్థలం గ్రౌండ్ లో గాని ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన కార్యక్రమం తెలిపేందుకు అవకాశం కల్పిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.









