రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాల అమలు.. సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలో ఎవరి పట్ల వివక్ష లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా పాలన పేదలు, రైతులు, మహిళలు, నిరుద్యోగుల కోసం పని చేస్తోందని పునరుద్ఘాటించారు.

రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాల అమలు.. సీఎం రేవంత్ రెడ్డి
నకిరేకల్, మన సాక్షి :
రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలో ఎవరి పట్ల వివక్ష లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా పాలన పేదలు, రైతులు, మహిళలు, నిరుద్యోగుల కోసం పని చేస్తోందని పునరుద్ఘాటించారు.
నల్గొండ జిల్లా నకిరేకల్లో రూ. 32 కోట్లతో నిర్మించిన 100 పడకల నూతన ప్రాంతీయ ఆసుపత్రిని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నకిరేకల్ రాజీవ్ గాంధీ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన వెయ్యి రోజుల ప్రజా పాలన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.
మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పలువురు ఎంపీలు, ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో రైతులు, మహిళలు, నిరుద్యోగుల అభ్యున్నతికి ప్రభుత్వం చేపట్టి అమలు చేస్తున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించారు. ప్రధానంగా రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్ వంటి రైతు సంక్షేమ పథకాలు, 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో మహిళలకు ఆర్థిక ప్రయోజనం కల్పించే సంక్షేమ పథకాలు, నిరుద్యోగుల కోసం ఉద్యోగ నియామకాల వంటి అంశాలను వివరించారు.
మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే నీరుగార్చాలని కొందరు ప్రయత్నించారని చెబుతూ, సూర్యుడు ఉదయించినంత కాలం, చంద్రుడు ఉన్నంత కాలం ఈ పథకం కొనసాగుతుందని స్పష్టంగా చెప్పారు.
కొత్త రేషన్ కార్డుల జారీ, 3.48 కోట్ల మందికి సన్న బియ్యం, గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ. 500కే సిలిండర్, పంపుసెట్లకు ఉచిత కరెంట్, రైతుల రుణమాఫీ, రైతు భరోసా వంటి వేటిల్లోనూ వివక్ష లేకుండా అందరికీ కొనసాగించామని చెప్పారు.
ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన వివిధ అభివృద్ధి పనులు
1. నియోజకవర్గంలో ₹9.85 కోట్ల వ్యయంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ (TGPS) భవన నిర్మాణం.
2. నకిరేకల్ మండలం కడపర్తి గ్రామంలో ₹200 కోట్ల వ్యయంతో “యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్” నిర్మాణం.
3. మునిపంపుల గ్రామంలో ₹3.62 కోట్ల వ్యయంతో 1 X 5 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ (PTR), 33/11 KV సబ్స్టేషన్, 33 KV & 11 KV విద్యుత్ లైన్లు, కంట్రోల్ రూమ్ నిర్మాణం.
4. కేతేపల్లి మండలం గుడివాడ గ్రామంలో ₹2.74 కోట్లతో 1 X 5 MVA PTRతో కూడిన 33/11 KV సబ్స్టేషన్, 33 KV, 11 KV లైన్ల ఏర్పాటు.
5. నకిరేకల్ మండలంలో ₹20 కోట్లతో సమీకృత మండల స్థాయి కార్యాలయాల (MDO/MRO Complex) సముదాయ నిర్మాణం.
6. ₹45.60 కోట్ల వ్యయంతో రహదారి అభివృద్ధి. (నకిరేకల్– గురజాల రోడ్ నుండి బైరౌనిబండ వరకు, బైరౌనిబండ నుండి అమ్మనబోలు–రామాంజాపూర్ రోడ్ వరకు, అమ్మనబోలు– రామాంజాపూర్ రోడ్డు విస్తరణ/అభివృద్ధి)
7. నకిరేకల్లో ₹1.10 కోట్లతో నిర్మించనున్న ఎక్సైజ్ శాఖ భవన నిర్మాణం.











