మరణం దాటి… మరో ఇద్దరికి కంటి చూపు
ఒక ఆదర్శప్రాయమైన నిర్ణయం రెండు జీవితాల్లోని చీకట్లను తరుముతూ వెలుగులు నింపనుంది. కార్నియా అంధత్వంతో బాధపడే ఇద్దరికి కంటి చూపును ప్రసాదించనుంది.

మరణం దాటి… మరో ఇద్దరికి కంటి చూపు
– గుడుగుంట్లపాలెం గ్రామస్థురాలు సోమమ్మ నేత్రదానం
– ఆదర్శంగా నిలిచిన యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడి కుటుంబం
మిర్యాలగూడ, మన సాక్షి:
ఒక ఆదర్శప్రాయమైన నిర్ణయం రెండు జీవితాల్లోని చీకట్లను తరుముతూ వెలుగులు నింపనుంది. కార్నియా అంధత్వంతో బాధపడే ఇద్దరికి కంటి చూపును ప్రసాదించనుంది.
సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని గుడుగుంట్లపాలెం గ్రామానికి చెందిన యూటీఎఫ్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బక్కా శ్రీనివాసాచారి తల్లి సోమమ్మ మంగళవారం రాత్రి కార్డియాక్ అరెస్ట్ తో మరణించారు. పుట్టెడు దు:ఖంలోనూ ఆమె కుటుంబ సభ్యులు సోమమ్మ నేత్రాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు.
లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ ఐ డొనేషన్ సెంటర్ ను సంప్రందించగా, అదే రాత్రి వారు గుడుగుంట్లపాలెం గ్రామానికి చేరుకుని రెండు కంటి పొరలను సేకరించారు. కార్నియా అంధత్వంతో బాధపడే ఇద్దరికి వాటిని అందించి కంటి చూపును ప్రసాదించనున్నట్టు ఐ డొనేషన్ సెంటర్ సిబ్బంది తెలిపారు.
చైతన్యవంతమైన నిర్ణయం తీసుకుని స్ఫూర్తిగా నిలిచిన బక్కా సోమమ్మ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సోమమ్మకు ఇద్దరు కుమారులు, ఐదుగురు కూతుళ్లు. గుడుగుంట్లపాలెం గ్రామంలో నేత్రదానం చేసిన మొదటి వ్యక్తి సోమమ్మనే అవడం అభినందనీయం.









