Karimnagar : హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి.. వీడిన మిస్టరీ..!
Karimnagar : హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి.. వీడిన మిస్టరీ..!
కరీంనగర్, మన సాక్షి :
కరీంనగర్ నగర శివారులోని బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద రైల్వే ట్రాక్ పక్కన జరిగిన హత్య కేసు మిస్టరీని కరీంనగర్ రూరల్ పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.
గత నెల జులై 29న సుభాష్ నగర్ కు చెందిన ఐలవేణి సంపత్ (45) రైల్వే ట్రాక్ పక్కన అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. గ్రంథాలయంలో స్వీపర్గా పనిచేసిన సంపత్, తన కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా మృతుడి భార్య ఐలవేణి రమాదేవి (38)పై అనుమానం రావడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు.
పోలీసుల దర్యాప్తులో వెల్లడైన సంచలన విషయాలు:
రమాదేవికి కిసాన్ నగర్ కు చెందిన కర్రె రాజయ్య (50) తో వివాహేతర సంబంధం ఉంది. భర్త సంపత్ మద్యానికి బానిస కావడంతో తరచూ రమాదేవిని కొట్టేవాడు. దీంతో విసిగిపోయిన రమాదేవి, రాజయ్య, తన దూరపు బంధువైన కీసరి శ్రీనివాస్ (35) (ఖాదర్ గూడెం) లతో కలిసి సంపత్ను హత్య చేయాలని ప్లాన్ వేసింది. ప్లాన్ ప్రకారం, రాజయ్య, శ్రీనివాస్ కలిసి సంపత్ను బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్దకు రమ్మని చెప్పి, అక్కడ మద్యం తాగారు.
సంపత్ పూర్తిగా మత్తులోకి వెళ్లిన తర్వాత, రమాదేవి ఫోన్ చేసి అతడిని చంపమని చెప్పింది. రమాదేవి ఆదేశాల మేరకు కిసాన్ నగర్ కు చెందిన రాజయ్య, ఖాదర్ గూడెం కు చెందిన శ్రీనివాస్ లు తమ వెంట తెచ్చుకున్న గడ్డి మందు (హెర్బిసైడ్)ను సంపత్ చెవిలో పోసి హత్య చేశారు. సంపత్ చనిపోయాడని నిర్ధారించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఆ తర్వాత, రమాదేవి, రాజయ్య, శ్రీనివాస్ ముగ్గురూ కలిసి సంపత్ కోసం వెతుకుతున్నట్లు నటించారు. చివరికి సంపత్ మృతదేహం ఉన్న ప్రాంతాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. హత్యకు ఉపయోగించిన రెండు మోటార్ సైకిళ్లు, మూడు సెల్ ఫోన్లను, మద్యం బాటిళ్లు , గడ్డి మందు (హెర్బిసైడ్) డబ్బాను పోలీసులు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
ఈ కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించిన కరీంనగర్ రూరల్ పోలీసులు, సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్సై లు తాండ్ర నరేష్, లక్ష్మా రెడ్డి మరియు వారి బృందాన్ని కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు.
MOST READ :
-
Good News : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. లేటెస్ట్ అప్డేట్..!
-
Miryalaguda : గెస్ట్ మహిళ ఉపాధ్యాయుల కొరకు దరఖాస్తుల స్వీకరణ..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే, పేటియం.. ఏదైనా పిన్ నెంబర్ ఉండదు.. మరి లావాదేవీలు ఎలాగో తెలుసుకుందాం..!
-
TG News : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి లక్ష రూపాయల రుణమాఫీ.. లేటెస్ట్ అప్డేట్..!









