విద్యార్థులకు షాక్ : బస్ పాస్ చార్జీలను
పెంచిన ఆర్టీసి
హైదరాబాద్, మనసాక్షి: టిఎస్ ఆర్టీసి ఒకేసారి ఏకంగా 3 నుంచి 4 రెట్లు బస్ పాస్ చార్జీలను పెంచి విద్యార్థులకు షాక్ ఇచ్చింది. డీజిల్ ధరలు, సెస్సు, నిర్వహణ వ్యయం పెరగడంతో బస్ పాస్ చార్జీలను సవరిస్తున్నట్లు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పేద విద్యార్థులపై భారం పడకుండా చూసేందుకు ప్రభుత్వాలు రాయితీపై బస్ పాసులు జారీ చేస్తాయి. కానీ ఈ సారి అందుకు భిన్నంగా భారీగా బస్ పాస్ చార్జీలు భారీగా పెంచారు.
కొన్ని మార్గాల్లో మునుపటి చార్జీలతో పోలిస్తే అత్యధికంగా 309 శాతం పెరిగాయి. గ్రేటర్ హైదరాబాద్ లో రూ. 215 ఉన్న నెలవారీ జనరల్ బస్ పాస్ చార్జీని రూ. 470 కి పెంచింది. మూడు నెలల బస్ పాస్ చార్జీని రూ. 645 నుండి రూ.1410 కు పెంచింది. అలాగే హైదరాబాద్ జిల్లాలో నెలవారీ స్టూడెంట్ జనరల్ బస్ పాస్ చార్జీ రూ. 165 నుండి రూ.400 కు, మూడు నెలల బస్ పాస్ చార్జీ రూ. 495 నుండి రూ. 1200 కు పెంచింది. గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం ఎనిమిది లక్షల బస్ పాస్ లు ఉన్నాయి. అందులో ఐదు లక్షల బస్ పాస్ లు విద్యార్థులవే. చార్జీల పెంపుతో విద్యార్థులపై రూ. 12 కోట్ల వరకూ అదనపు భారం పడే అవకాశం ఉంది.
అలాగే రూట్ పాస్ ల చార్జీలు కూడా మూడు నుండి నాలుగు రెట్లు పెరిగాయి. నాలుగు కిలోమీటర్ల లోపు రూట్ బస్ పాస్ క్వార్టర్లీ చార్జీ రూ. 165 నుండి రూ. 450 కి పెరిగింది. 8 కిలోమీటర్ల లోపు రూట్ బస్ పాస్ చార్జీ రూ. 200 నుంచి రూ. 600 కి పెరిగింది. ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల బస్పాస్ చార్జీలను మాత్రం రెండింతలు చేశారు. బస్పాస్ చార్జీలను భారీగా పెంచడంతో సామాన్య, మధ్యతరగతి విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతుందని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
1.వారిద్దరికీ డేటింగ్ యాప్ ద్వారా పరిచయం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే – latest news
2. Viral News : ఆ కోడిపుంజుకు మందు లేనిదే ముద్ద దిగదు
3. దుబాయిలో భారతీయుడికి రూ. 2 కోట్లు దొరికితే.. ఏం చేశాడంటే ?









