Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

అక్కడ ఫోన్ వస్తది.. మాటలు వినిపించవు..!

గరిడేపల్లి మండలంలో మొబైల్‌ నెట్‌వర్క్‌ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అక్కడ ఫోన్ వస్తది.. మాటలు వినిపించవు..!

(గరిడేపల్లి, మనసాక్షి – వీరాస్వామి)

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో మొబైల్‌ నెట్‌వర్క్‌ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని అనేక గ్రామాల్లో ఏ మొబైల్‌ నెట్‌వర్క్‌ సిమ్‌ వాడినా సరైన సిగ్నల్‌ అందకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొబైల్‌ సేవలకు నెలనెలా రీచార్జ్‌ చేసుకుంటున్నప్పటికీ అందుకు తగ్గట్టుగా నాణ్యమైన సేవలు అందడం లేదని వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఫోన్‌ చేస్తే మాటలు వినిపించవు..

మొబైల్‌లో మాట్లాడుతున్న సమయంలో అకస్మాత్తుగా కాల్‌ కట్‌ కావడం, అవతలి వ్యక్తి మాటలు సరిగ్గా వినిపించకపోవడం, మన మాటలు అవతలి వారికి వినిపించకపోవడం వంటి సమస్యలు తరచూ ఎదురవుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. అత్యవసర సమయాల్లో ఫోన్‌ చేయాల్సి వచ్చినప్పుడు కూడా నెట్‌వర్క్‌ అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ALSO READMiryalaguda : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో టాంకర్ బీభత్సం.. ఒకరి మృతి..!

ఇంటర్నెట్‌ స్పీడ్‌ మరీ దారుణం

మొబైల్‌ డేటా విషయంలో పరిస్థితి మరింత దారుణంగా ఉందని వినియోగదారులు అంటున్నారు. 4G, 5G పేరుతో డేటా ప్యాక్‌లకు డబ్బులు చెల్లిస్తున్నా.. వాస్తవంగా మాత్రం వెబ్‌సైట్లు తెరుచుకోవడానికి, వీడియోలు చూడటానికి, ఫైళ్లు డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి నిమిషాల తరబడి సమయం పడుతోందని వాపోతున్నారు.

విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులు, ఉద్యోగార్థులు ఆన్‌లైన్‌ దరఖాస్తులు, వ్యాపారులు డిజిటల్‌ చెల్లింపులు, ఉద్యోగులు అధికారిక పనుల కోసం ఇంటర్నెట్‌పై ఆధారపడుతున్న నేపథ్యంలో నెట్‌వర్క్‌ సమస్యతో రోజువారీ పనులు సైతం నిలిచిపోతున్నాయని చెబుతున్నారు.

డబ్బులు మాత్రం ఫుల్‌.. సేవలు మాత్రం స్లోగా!

ప్రతి నెలా మొబైల్‌ రీచార్జ్‌ కోసం వినియోగదారుల నుంచి పూర్తి స్థాయిలో ఛార్జీలు వసూలు చేస్తున్న టెలికాం సంస్థలు.. గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన నెట్‌వర్క్‌ అందించడంపై కూడా దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. కేవలం రీచార్జ్‌ ధరలు పెంచడం కాకుండా వినియోగదారులకు నిరంతరాయమైన కాలింగ్‌, వేగవంతమైన ఇంటర్నెట్‌ సేవలు అందించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ALSO READUPI : యూపీఐ పేమెంట్స్ కు అలా చేస్తే చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు..!

టవర్లు ఉన్నా ప్రయోజనం ఏదీ..?

మండలంలోని పలు ప్రాంతాల్లో మొబైల్‌ టవర్లు ఉన్నప్పటికీ సిగ్నల్‌ నాణ్యత ఆశించిన స్థాయిలో లేదని స్థానికులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇంటి బయటకు వస్తేనే సిగ్నల్‌ రావడం, ఒకే ఇంట్లో ఒక గదిలో సిగ్నల్‌ ఉండి మరో గదిలో లేకపోవడం వంటి పరిస్థితులు ఉన్నాయని వినియోగదారులు పేర్కొంటున్నారు.

అధికారులు, టెలికాం సంస్థలు స్పందించాలి

గరిడేపల్లి మండలంలోని గ్రామాల్లో మొబైల్‌ నెట్‌వర్క్‌ పరిస్థితిపై సంబంధిత అధికారులు, టెలికాం సంస్థలు ప్రత్యేకంగా పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు. అవసరమైన చోట్ల కొత్త టవర్లు ఏర్పాటు చేయడంతో పాటు ఇప్పటికే ఉన్న టవర్ల సామర్థ్యాన్ని పెంచి కాల్‌ డ్రాప్‌లు, వాయిస్‌ డిస్టర్బెన్స్‌, నెమ్మదైన ఇంటర్నెట్‌ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్‌ చేస్తున్నారు.

రీచార్జ్‌ చేయించుకోవడంలో ముందుండే కంపెనీలు.. సేవలు అందించడంలోనూ అదే స్థాయిలో ముందుండాలని గరిడేపల్లి మండల ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు