Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsతెలంగాణనల్గొండ

Komatireddy : తెలంగాణ రాష్ట్ర ఘనత అమరులదే.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!

Komatireddy : తెలంగాణ రాష్ట్ర ఘనత అమరులదే.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!

నల్లగొండ , మన సాక్షి.

తెలంగాణ రాష్ట్ర సాధన ఘనత అమరులదే నని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17 కీలకమైన రోజని, నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణ ప్రజలు విముక్తిని పొందిన రోజు సెప్టెంబర్ 17 అని అన్నారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి మంత్రి సందేశం ఇస్తూ…. ఆగస్టు 15, 1947 న దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ ,హైదరాబాద్ సంస్థనానికి రాలేదని ,అప్పటి నిజాము హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్రంగా ఉంటుందని ప్రకటించారని, నిజాం నిరంకుశుపాలనలో భూస్వామ్య వ్యవస్థకు , జాగిర్దారి విధానం, వేట్టి చాకిరి, బలవంతంగా పన్నులు వసూలు చేయడం , రజాకారుల దాస్టికం ,ఆగడాలను తెలంగాణ ప్రజలు భరించలేక నిజామ్ వ్యతిరేక పోరాటాన్ని ప్రారంభించారని, రైతులు, మహిళలు, సకలజనులు ఏకమై హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ యూనియన్లో విలీనం చేయాలని సాయిధ పోరాటాన్ని ఉదృతం చేశారన్నారు.

ఇందుకోసం నాటి ఆంధ్ర జన కేంద్ర సభ, ఆంధ్ర మహాసభలో పనిచేసిన మహానుభావులు ఎందరో తెలంగాణ ప్రజలను చైతన్య పరచారని, ప్రత్యేకించి తెలంగాణ సాయుధ పోరాటంలో నల్గొండ జిల్లా కీలక పాత్ర పోషించిందని, ముఖ్యంగా భీంరెడ్డి నరసింహారెడ్డి, బొమ్మ గాని ధర్మభిక్షం, ఆరుట్ల రామచంద్రారెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, జిట్టా రామచంద్రారెడ్డి, సుశీలాదేవి, సుద్దాల హనుమంతు, బొందుగుల నారాయణరెడ్డి వంటి ఎంతోమంది త్యాగదనులు తెలంగాణలో స్వతంత్ర ఉద్యమాన్ని ప్రభావితం చేశారన్నారు. దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం తీవ్రమైందని, చాకలి ఐలమ్మ మల్లు స్వరాజ్యం ఇందులో కీలక పాత్ర పోషించారని, బండి యాదగిరి రాసిన బండేనక బండి కట్టి
పాట తెలంగాణ సాయుధ పోరాటాన్ని మరో మెట్టు ఎక్కించగా, నల్గొండ జిల్లాకు చెందిన సుద్ధాల హనుమంతు వెట్టిచాకిరిని వ్యతిరేకిస్తూ పాలబుగ్గల జీతగాడ అనే పాట సాయిధ పోరాటాన్ని ఉధృతం చేసేందుకు దోహద పడిందని అన్నారు.

భూస్వామ్య , జమీందారులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో నల్గొండ జిల్లాలోని అనేక గ్రామాలు గుండ్రంపల్లి, కడవెండి ,రావులపెంట, ఎనిమిది గూడెం, ప్రాంతాలు కేంద్ర బిందువులుగా నిలిచాయని తెలిపారు. హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజలపై రజాకారులు, జమీందారుల దాడులు పెరుగుతున్నాయని గ్రహించి అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపి భారత యూనియన్ లో విలీనం చేశారని తెలిపారు.

1948, 17 సెప్టెంబర్ న హైదరాబాద్ రాష్ట్రాన్ని ఇండియన్ యూనియన్ లో విలీనం చేస్తూ నిజాం ప్రకటించారని అందుకే ఈ రోజున ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు.తదనంతరం 1952 లో సార్వత్రిక ఎన్నికలు జరగడం ,అనంతరం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు కావడం, తెలంగాణకు ఆన్యాయం జరుగుతున్నదని గ్రహించిన తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నాంది పలికిందని, ఈ ఉద్యమంలో 300 మందికి పైగా అమరులయ్యారని తెలిపారు.

కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్, జలగం వెంగళరావు లాంటి వారు తెలంగాణ తొలిదశ ఉద్యమాన్ని ముందుండి నడిపించారని, అనంతరం ఏర్పాటు చేసిన జోనల్ వ్యవస్థ సైతం తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర కాంక్ష తీర్చలేక పోయిందని, ఫలితంగా 2011 నుండి తెలంగాణ మలిదశ ఉద్యమం ప్రారంభమైందని, తెలంగాణ ఐక్య కార్యచరణ సమితి నాయకత్వంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల తీవ్ర ఉద్యమం చేశారని ,నల్గొండ జిల్లాకు చెందిన కాసోజు శ్రీకాంతాచారి తో పాటు, ఎంతో మంది యువకులు ప్రాణాలు కోల్పోయారని,తాను సైతం మంత్రి పదవికి రాజీనామా చేసి 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశానని తెలిపారు.

తెలంగాణ ఉద్యోగులు, కార్మికులు, తమ ఉద్యోగాలను పణంగా పెట్టి 42 రోజుల పాటు సకల జనుల సమ్మె చేశారని ,2011 మార్చి 10 న మిలియన్ మార్చ్ పేరుతో లక్షల మంది ఉద్యమకారులు హైదరాబాదులో ప్రజలను కదం తొక్కారని, వంటావార్పు, సాగరహారం, ధర్నాలు చేసిన తీరును చూసి అప్పటి ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ శ్రీకృష్ణ కమిటీని నియమించిందని ,అక్టోబర్ 2013 న కేంద్ర మంత్రిమండలి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం తెలిసిందని, 2014 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయిందని తెలిపారు.

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమరులకు ,మహిళలకు, రైతులకు, అన్ని వర్గాల ప్రజలకు గౌరవాన్ని కల్పిస్తూ ప్రభుత్వం ముందుకెళుతున్నదని తెలిపారు .హైదరాబాద్ కోటి లోని మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా, హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేర్లు పెట్టడం జరిగిందని తెలిపారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఒక్కోటిగా అమలు చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని, ప్రభుత్వ ,ప్రభుత్వంగ సంస్థలు కొత్త ఉద్యోగాల కల్పనకు జాబ్ క్యాలెండర్ ను ప్రకటించామని, మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించడం జరిగిందని, ఆరోగ్య శ్రీ పరిమితిని ఐదు నుండి 10 లక్షల రూపాయలకు పెంచామని, మహాలక్ష్మి పథకం కింద నిరుపేదలకు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నామని , ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సైతం ప్రారంభించనున్నామని, నిరుపేదలకు గృహ జ్యోతి కింద నేలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని ,చరిత్రలో కనివిని ఎరగని వీటిలో రైతులకు ఏకకాలంలో రెండు లక్షల వరకు రుణమాఫీ చేశామని, నల్గొండ జిల్లాలో లక్ష 73 వేల రైతు కుటుంబాలకు 1433 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగిందని తెలిపారు.

ALSO READ Rythu Barosa : 20న తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై నిర్ణయం.. రైతు భరోసా ప్రారంభం అప్పుడే..!

రాబోయే రోజుల్లో ఇంకా కష్టపడి నల్గొండ జిల్లా రైతులకు అండగా ఉంటామని తెలిపారు .ప్రజాగాయకుడు గద్దర్ పేరిట సినీ అవార్డులను ఏర్పాటు చేశామని, అందే శ్రీ రాసిన జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించుకున్నామని, బహుజన ప్రజారాజ్య స్థాపకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని, మహిళలకు పూర్తి అధికారం ఇస్తూ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేశామని ,పారిస్ పారా ఒలంపిక్ లో పథకం సాధించిన తెలంగాణ బిడ్డ జీవంజి దీప్తికి కోటి రూపాయల పారితోషకాన్ని ప్రభుత్వం ఇవ్వడమే కాకుండా 500 గజాల ఇంటి స్థలాన్ని సైతం ఇచ్చిందని, ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున అంతర్జాతీయ ప్రమాణాలతో సమీకృత గురుకుల పాఠశాలలను నిర్మిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ ప్రకటించామని అన్నారు.

నల్గొండ జిల్లా ప్రజల కష్టాలను తీర్చేందుకు తను స్వయంగా వారానికి ఒక రోజు ప్రజా దర్బార్ నిర్వహించి వారి కష్టాలను తీర్చడం జరుగుతున్నదని తెలిపారు .ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఎస్ ఎల్ బి సి టన్నెల్ నిర్మాణం కోసం ఇటీవల అమెరికా వెళ్లి టన్నెల్ బోరింగ్ రిపేరికి చర్యలు తీసుకోవడం జరిగిందని, త్వరలోనే ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను రాష్ట్ర మంత్రి ఉప ముఖ్యమంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రితో ,ఇతర ప్రజాప్రతినిధులందరితో కలిసి పరిశీలించనున్నామని మంత్రి వెల్లడించారు.

నల్గొండలో కరెంటు మోటార్లు మోటర్ లేని వ్యవసాయం చూడాలన్నదే తమ అభిమతమని, బ్రాహ్మణ వెల్లేముల లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని త్వరితగతిన పూర్తి చేసి జిల్లాను సస్య శ్యామలం చేస్తామని అన్నారు .275 కోట్ల రూపాయలతో ప్రభుత్వ వైద్య కళాశాల, 20 కోట్ల రూపాయలతో నర్సింగ్ కళాశాల నిర్మించుకుంటున్నామని, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను సైతం నిర్మిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర దశ, దిశను మార్చే రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సర్వం సిద్ధంగా ఉందని, అలాగే రాష్ట్ర అభివృద్ధిలో సూపర్ గేమ్ చేంజెర్ గా రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం విలువనుందని, నల్గొండ జిల్లా ప్రజలకు ముఖ్యమైన జాతీయ రహదారి 65 హైదరాబాద్- విజయవాడ నిత్య ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని విస్తరించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని ,541 కోట్ల రూపాయల అంచనా తో ఆందోల్ మైసమ్మ నుంచి తెలంగాణ రాష్ట్ర సరిహద్దు వరకు కొత్త టెండర్లను పిలవడం జరిగిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు.

నల్గొండ జిల్లాలో 2024 -25 సంవత్సరంలో 241.90 కిలోమీటర్ల రోడ్లు, బ్రిడ్జిలు, మూడు భవనాల మరమ్మతులకు 512 కోట్ల 81లక్షల రూపాయలు మంజూరు చేసామని చెప్పారు.జిల్లా సర్వతో ముఖాముఖివృద్ధికి జిల్లాలోని ప్రతి ఒక్కరు తన సహకారం అందించాలని మంత్రి కోరారుఅంతకుముందు మంత్రి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు.

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ ,నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, అదనపు కలెక్టర్లు టీ .పూర్ణచంద్ర, జే శ్రీనివాస్ ,అదనపు ఎస్పి రాములు నాయక్, డిఆర్ఓ రాజ్యలక్ష్మి, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, ఆర్డిఓ రవి, జిల్లా అధికారులు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

LATEST UPDATE : 

Ration Cards : పేదలకు ఇక సన్న బియ్యం.. ప్రభుత్వ నిర్ణయం, ఎప్పటి నుంచి అంటే..! 

Komatireddy : రూ. 2000 కోట్లతో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి ఆరు లైన్లుగా విస్తరణ..!

Nelakondapally : రైతులకు రూ.10వేల సహాయం.. మంత్రి పొంగులేటి వెల్లడి..!

మరిన్ని వార్తలు