District Collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. అధికారులు సమన్వయంతో పని చేయాలి..!
రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పట్టు పరిశ్రమ, ఉద్యానవన, మత్స్య, పశుసంవర్ధక, వ్యవసాయ శాఖల పనితీరు, ప్రభుత్వ పథకాల అమలుపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

District Collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. అధికారులు సమన్వయంతో పని చేయాలి..!
కరీంనగర్, మనసాక్షి:
రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పట్టు పరిశ్రమ, ఉద్యానవన, మత్స్య, పశుసంవర్ధక, వ్యవసాయ శాఖల పనితీరు, ప్రభుత్వ పథకాల అమలుపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమావేశంలో ఆయా శాఖల అధికారులు తమ శాఖల ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలు, రైతులకు అందిస్తున్న ప్రభుత్వ పథకాలు, వాటి ప్రగతి వివరాలను కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ రైతుల సమస్యలను తెలుసుకోవడానికి అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు.
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి రైతుకు చేరేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
మండలాల వారీగా సాగు భూముల విస్తీర్ణం, సాగవుతున్న పంటలు, ఆయిల్ పామ్, వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయలు, పూలు, పండ్ల తోటల వివరాలు, భూముల స్వరూపం, వర్షపాతం పరిస్థితులు, రైతు వేదికల ద్వారా అందుతున్న సేవలు, రైతులకు అనుకూల, ప్రతికూల అంశాలపై సమగ్ర నివేదికలు సిద్ధం చేసి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియలో మండల వ్యవసాయ అధికారులను నోడల్ అధికారులుగా నియమిస్తూ సమన్వయ బాధ్యతలు అప్పగించారు.
జిల్లాలో వ్యవసాయాభివృద్ధికి సంబంధించి ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక సాగు విధానాలపై అవగాహన పెంపొందించేందుకు త్వరలో వ్యవసాయ విస్తరణ అధికారులకు (ఏఈఓలు) ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మిని ఆదేశించారు.
జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులకు పంటల మార్పిడి విధానం, ప్రత్యామ్నాయ సాగు పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని ఆరుతడి పంటల సాగును ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు.
ఈ సమీక్ష సమావేశంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు, డివిజన్ మరియు మండల వ్యవసాయ అధికారులు, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్య, పట్టు పరిశ్రమ శాఖల అధికారులు పాల్గొన్నారు.










