Alumni : జ్ఞాపకాల పందిరిలో పూర్వ విద్యార్థులు.. ఆత్మీయ సమ్మేళనం..!
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం పిట్టలగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 2008-09 విద్యా సంవత్సరం బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన వేడుకలు దర్వేశిపురంలోని ఆనందపు రామ్మూర్తి ఫంక్షన్ హాల్లో ఆదివారం అత్యంత వైభవంగా, కోలాహలంగా జరిగింది.

Alumni : జ్ఞాపకాల పందిరిలో పూర్వ విద్యార్థులు.. ఆత్మీయ సమ్మేళనం..!
గుర్రంపోడు, మన సాక్షి
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం పిట్టలగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 2008-09 విద్యా సంవత్సరం బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన వేడుకలు దర్వేశిపురంలోని ఆనందపు రామ్మూర్తి ఫంక్షన్ హాల్లో ఆదివారం అత్యంత వైభవంగా, కోలాహలంగా జరిగింది . ఒకే తరగతి గదిలో కలిసి చదువుకుని, దాదాపు పదిహేనేళ్ల తర్వాత మళ్లీ ఒకే వేదికపై కలుసుకునే సరికి ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణాన్ని తలపించింది.
తమ చిన్ననాటి ప్రాణస్నేహితులను ఒకరినొకరు కౌగిలించుకుని, ఆప్యాయంగా పలకరించుకుంటూ పూర్వ విద్యార్థులు ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. పాఠశాల రోజుల్లో జరిగిన మధుర స్మృతులను నెమరువేసుకుంటూ, నాటి అల్లరి పనులు, తరగతి గదిలో జరిగిన హాస్య సంఘటనలను ఒకరితో ఒకరు పంచుకుంటూ పూర్వ విద్యార్థులంతా తమ బాల్య జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయారు.
ఈ ఆత్మీయ కలయిక సందర్భంగా.. తమకు అక్షరాలు నేర్పించి, క్రమశిక్షణతో కూడిన విద్యాబుద్ధులు అందించి, ఈరోజు సమాజంలో ప్రయోజకులుగా తీర్చిదిద్దిన నాటి గురువులను విద్యార్థులు అత్యంత భక్తిశ్రద్ధలతో గుర్తుచేసుకున్నారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. బిజీ జీవితంలో ఎంత దూరంలో ఉన్నప్పటికీ, చిన్ననాటి స్నేహాన్ని గుర్తుపెట్టుకుని ఈ కార్యక్రమానికి తరలిరావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గురువుల రుణం తీర్చుకోలేనిదని, వారి మార్గదర్శకత్వంలోనే తామంతా ఉన్నత స్థానాల్లో నిలబడగలిగామని కృతజ్ఞత భావంతో చాటారు. అనంతరం సహచర విద్యార్థిని, విద్యార్థులందరూ కలిసి ఎంతో ఉత్సాహంగా వినోద కార్యక్రమాల్లో పాల్గొన్నారు.









